ఆర్టీసీ బస్సులో మిస్టరీ మృతి.. తల పగిలి..!
ABN , First Publish Date - 2021-04-18T18:19:52+05:30 IST
కోఠిలోని గోకుల్ చాట్ వద్ద కొందరు వెనుక సీటులో చూడగా...
- చివరి సీట్లో కూర్చున్న ప్రయాణికుడు
- తల పగిలి కనిపించాడు
హైదరాబాద్/మంగళ్హాట్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తికి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తలకు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై బస్సు వెనుక సీటులో చనిపోయిన ఘటన సుల్తాన్బజార్పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జగిత్యాలకు చెందిన పవన్ చైతన్య దిల్సుఖ్నగర్ వెళ్లేందుకు పటాన్చెరువులో ఆర్టీసీ బస్సు(ఏపీ 28 జెడ్ 2790) ఎక్కాడు. చివరి సీట్లో కిటికీ పక్కన కూర్చున్నాడు. కోఠిలోని గోకుల్ చాట్ వద్ద కొందరు వెనుక సీటులో చూడగా, పవన్ చైతన్య తలపగిలి తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలో కనిపించాడు.
ప్రయాణికులు, కండక్టర్ గమనించి బస్సును నిలిపేసి సుల్తాన్బజార్ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే పవన్ చైతన్య మృతి చెందినట్లు గుర్తించారు. కిటికీ పక్కన కూర్చున్న పవన్ చైతన్యకు వేరే వాహనం తగలడంతో తలకు తీవ్ర గాయలై మృతిచెందాడా..?, లేక ఏదైనా ఘటన వల్ల ప్రమాదం జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అంతకు ముందు బస్సు ముందు టైర్లు గుంతలోపడి కుదుపులకు గురైనట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఆ సమయంలో పవన్ చైతన్య తల వెనక సీటు ఇనుపరాడ్కు బలంగా తగలడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.