ఎన్హెచ్ అఽధికారుల నిర్లక్ష్యం.. రైతుల పాలిట శాపం
ABN , First Publish Date - 2021-07-26T06:30:39+05:30 IST
కంచికచర్ల వద్ద ఇంతకు ముందున్న రెండు లేన్ల బైపాస్ రోడ్డును వందల కోట్లతో ఆరు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.
లోపభూయిష్టంగా కల్వర్టుల నిర్మాణం
ముంపునకు గురవుతున్న పంట పొలాలు
గత ఏడాదే చర్యలు తీసుకుంటామని.. చేతులెత్తేసిన అధికారులు
కంచికచర్ల : కంచికచర్ల వద్ద ఇంతకు ముందున్న రెండు లేన్ల బైపాస్ రోడ్డును వందల కోట్లతో ఆరు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. విస్తరణలో భాగంగా చెవిటికల్లు క్రాస్ రోడ్డు వద్ద నిర్మించిన కల్వర్టుల వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఎగువ భూముల నుంచి వచ్చే నీరు కల్వర్టుల గుండా సజావుగా దిగువకు వెళ్లటం లేదు. పది అడుగుల దూరంలోనే ఏర్పాటు చేసిన రెండు కల్వర్టులు నిరుపయోగంగా మారాయి. మూడో కల్వర్టులో నీరు వ్యతిరేక దిశలో వెళుతోంది. దీంతో కల్వర్టుల పుణ్యమా అంటూ పంట భూములకు ముంపు సమస్య అధికమైంది. రోజుల తరబడి వరద నీరు బయటకు వెళ్లకపోవటంతో పైర్లు నిలువునా దెబ్బతింటున్నాయి. కల్వర్టుల డిజైన్లోనే లోపం ఉందని రైతులు అంటున్నారు. పైగా కల్వర్టుల వద్ద ఏర్పాటు చేసిన రివిట్మెంట్ అడ్డంకిగా తయారైంది. దీనికితోడు కల్వర్టుల్లోకి వరద నీరు వచ్చే మార్గాలు మూసుకుపోయాయి. వర్షాకాలంలో రైతులను ముంపు సమస్య వెంటాడుతోంది. గత ఏడాది ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, అప్పటి కలెక్టర్ను, ఇతర అధికారులను బైపాస్ రోడ్డుకు తీసుకువచ్చి ముంపు సమస్యను ప్రత్యక్షంగా చూపించారు. అధికారులు సమస్యను శాశ్వతంగా పరిష్కరించకుండా, అప్పటికప్పుడు తాత్కాలిక చర్యలతో సరిపెట్టటం వల్ల నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మరోసారి ముంపు సమస్య ఏర్పడింది. తహసీల్దార్ రాజకుమారి, రోడ్డు కంట్రాక్టరు ప్రతినిధి వచ్చి పరిశీలించారు. కనీసం రివిట్మెంట్ తొలగించినట్లయితే వరద నీరు వెళ్లిపోతుం దని రైతులు చెప్పగా, రోడ్డు దెబ్బతింటుందంటూ కంట్రాక్టరు ప్రతినిధి అభ్యంతరం తెలిపారు. ఉపసమనంగా ఎక్స్కవేటర్తో ఏదో కొద్దిగా కాల్వ తీసి మమ అనిపించారు. పైర్లు దెబ్బతింటున్నందున తమకు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పాలకులు, ఎన్హెచ్ఏఐ అఽధికారులు స్పందించి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిం చాల్సిందిగా రైతులు కోరుతున్నారు.
దీనిపై రైతు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బైపాస్ విస్తరణ పనుల్లో అవసరమైన చోట కల్వర్టులు నిర్మించలేదన్నారు. ప్రస్తుతం నిర్మించిన కల్వర్టుల గుండా వరద నీరు ఏమాత్రం వెళ్లటం లేదన్నారు. రోడ్డు పక్కన సైడ్ కాల్వ నిర్మించాలని మూడేళ్ల క్రితం అప్పటి ఎన్హెచ్ఏఐ విజయవాడ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ చెప్పినప్పటికీ నిర్మించలేదన్నారు. వరద వెళ్లే మార్గానికి అడ్డంగా రివిట్మెంట్ చేయటం వల్ల పంట పొలాలు ముంపునకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తంచ ేశారు. గత ఏడాది జీఎం (టెక్నికల్) సాహూను, రైతులు కల్సి సమస్య వివరించగా, రివిట్మెంట్ను తొలగిస్తామ న్నారు. కానీ ఇప్పటి వరకు తొలగించలేదన్నారు.