AP News.. టీచర్లను బోధనకు దూరం చేసి వదిలించుకొనే కుట్ర: నాదెండ్ల మనోహర్
ABN , First Publish Date - 2022-08-17T21:02:40+05:30 IST
రాష్ట్రంలో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి వదిలించుకొనే కుట్ర మొదలైందని నాదెండ్ల మనోహర్..
అమరావతి (Amaravathi): రాష్ట్రంలో ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి వదిలించుకొనే కుట్ర మొదలైందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడమే వైసీపీ (YCP) ఆలోచనని, అందులో భాగంగానే వేధింపులు మొదలయ్యాయన్నారు. ఇంటి గడప దాటి సచివాలయానికి వెళ్లని సీఎం జగన్ (CM Jagan) కూడా హాజరు గురించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పాఠశాల విద్యను పేదలకు దూరం చేసే కుట్రకు వైసీపీ ప్రభుత్వం తెర తీసిందని ఆరోపించారు. ఉపాధ్యాయులను వదిలించుకుని, ప్రభుత్వ స్కూల్స్ బైజూస్ లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచన చేస్తోందని, దీనికి సంస్కరణలు, సాంకేతికత వినియోగం లాంటి ముసుగు వేస్తోందని విమర్శించారు.
ఇప్పుడు ఉపాధ్యాయుల హాజరుకి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ యాప్ అని గందరగోళపరుస్తున్నారని నాదెండ్ల అన్నారు. ఇంటి గడప దాటి సచివాలయానికి వెళ్లని ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల హాజరులో నిమిషం ఆలస్యమైతే ఆబ్సెంట్ అంటూ ఉత్తర్వులు ఇప్పించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన ఎప్పుడూ సచివాలయానికి వెళ్లకపోవడం వల్ల అభివృద్ధి పటంలో ఏపీ ఆబ్సెంట్ అయిపోయిందని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.