పబ్‌లో నిహారిక ఉండడం వల్లే స్పందిస్తున్నా: నాగబాబు

ABN , First Publish Date - 2022-04-03T21:06:22+05:30 IST

ఫుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంపై నటుడు నాగబాబు స్పందించారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని నాగబాబు కోరారు.

పబ్‌లో నిహారిక ఉండడం వల్లే స్పందిస్తున్నా: నాగబాబు

హైదరాబాద్: ఫుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంపై నటుడు నాగబాబు స్పందించారు. నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని నాగబాబు కోరారు. ‘‘పబ్‌లో నిహారిక ఉండడం వల్లే నేను స్పందిస్తున్నాను. నిర్ణీత సమయానికి మించి పబ్‌ నడుపుతున్నారనే.. పోలీసులు చర్యలు తీసుకున్నారు. నా కూతురు నిహారిక విషయంలో అంతా క్లియర్‌. నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పారు. ఊహాగానాలకు తావివ్వకూడదనే దీనిపై స్పందిస్తున్నాను. ఈ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని  నాగబాబు ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. 


బంజారాహిల్స్‌లో డ్రగ్స్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఫుడింగ్ మింక్ పబ్‌లో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. కొకైన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఫుడింగ్ మింక్ పబ్‌లో తెల్లవారుజాము వరకు జోరుగా పార్టీ సాగింది. పక్కా సమాచారంతో పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు రంగప్రవేశంతో కిటికీలోంచి పడేసిన 12 ప్యాకెట్ల డ్రగ్స్‌ను యువతీ యువకులు పడేశారు. ఈ కేసులో 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. పబ్ యజమాని అభిషేక్‌ ఉప్పాలగా గుర్తించారు. అభిషేక్ ఉప్పాల ఇటీవల పబ్‌ను లీజ్‌కు తీసుకున్నాడు. ఫుడింగ్ మింక్ పబ్‌కు డ్రగ్స్ సరఫరాపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో పోలీసులు పరిశీలిస్తున్నారు. పబ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-04-03T21:06:22+05:30 IST