మహా కుంభమేళా ఏర్పాట్ల వివరాలు కోరిన నైనిటాల్ హైకోర్టు

ABN , First Publish Date - 2020-11-26T22:09:03+05:30 IST

మహా కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను

మహా కుంభమేళా ఏర్పాట్ల వివరాలు కోరిన నైనిటాల్ హైకోర్టు

నైనిటాల్ : మహా కుంభమేళా ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను డిసెంబరు 2లోగా సమర్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని నైనిటాల్ హైకోర్టు కోరింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో క్వారంటైన్ సెంటర్లు తగిన సంఖ్యలో లేవని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వివరాలను కోరింది. 


మహా కుంభమేళా 2021 జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా ప్రారంభమవుతుంది. హరిద్వార్‌లోని గంగా నదిలో ఈ మేళా జరుగుతుంది. దేశ, విదేశాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి, భక్తిశ్రద్ధలతో గంగా నదిలో స్నానమాచరించి, పూజలు చేస్తారు. కుంభమేళాలు 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. హరిద్వార్, నాసిక్, అలహాబాద్, ఉజ్జయినిలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట జరుగుతాయి. సాధువులు, వారి శిష్యులు మొదటి పవిత్ర స్నానాలు 2021 మార్చి 11న (మహాశివరాత్రి), రెండో పవిత్ర స్నానాలు ఏప్రిల్ 12న (సంవతి అమావాస్య), మూడో పవిత్ర స్నానాలు ఏప్రిల్ 14న (వైశాఖి) ఆచరిస్తారు. ఏప్రిల్ 27న సాధువులు, వారి శిష్యులు నాలుగో పవిత్ర స్నానాలు (చైత్ర పూర్ణిమ) ఆచరించడంతో హరిద్వార్ కుంభమేళా ముగుస్తుంది. 


మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (ఫిబ్రవరి 11), వసంత పంచమి (ఫిబ్రవరి 16), మాఘ పౌర్ణమి (ఫిబ్రవరి 27), శ్రీరామ నవమి (ఏప్రిల్ 21) సందర్భంగా భక్తులు స్నానాదికాలు ఆచరిస్తారు. 


మహా కుంభమేళా సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. సామూహిక అన్నదానాలు, మతపరమైన చర్చలు, భక్తి గీతాల ఆలాపన వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. కుంభమేళాకు యునెస్కో గుర్తింపు లభించింది. 


Updated Date - 2020-11-26T22:09:03+05:30 IST