దళితుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: నక్కా ఆనందబాబు

ABN , First Publish Date - 2021-04-12T17:49:31+05:30 IST

దళితుల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్‌కు లేదని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు.

దళితుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: నక్కా ఆనందబాబు

తిరుపతి: దళితుల గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్‌కు లేదని టీడీపీ నేత నక్కా ఆనందబాబు అన్నారు. సోమవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి దళితుల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలను వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫిజియో తెరపి చేస్తున్న ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో వారిపైనే  కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. దుర్గా ప్రసాద్ చనిపోయాక వారి కుటుంబాన్ని పరామర్శించలేదని, సిట్టింగ్ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఇచ్చే ఆనవాయితీని కూడా పట్టించుకోలేదని, వారిని ఇంటికి పిలిపించుకుని బెదిరించి ఎమ్మెల్సీ ఇస్తాం పొండి అని చెప్పి పంపారని విమర్శించారు.

 

తిరుమలలో ఓ కార్యక్రమంలో నారాయణస్వామిని నిల్చో బెట్టి అవమానించారని, దళితుల హక్కులను కాలరాస్తున్నారని నక్కా ఆనందబాబు విమర్శించారు. ఆర్థిక సమానత్వం పేరుతో రిజర్వేషన్‌ను తొలగించాలని సీఎం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దళిత విద్యార్థుల కోసం చంద్రబాబు రూ. 1050 కోట్లు ఇస్తే... దాన్ని ముఖ్యమంత్రి జగన్ రూ. 750 కోట్లకు కుదించారన్నారు. స్టడీ సర్కిళ్లు ఉన్నపుడు దళిత పిల్లలు ఐఎఎస్, ఐపిఎస్ అయ్యేవారని, ఉన్న మూడు స్టడీ సర్కిళ్లను ప్రభుత్వం మూసివేసిందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అవమానించటం అంటే అంబేద్కర్‌ను అవమానించటమేనని, దళిత సంఘాలు ఆలోచించుకోవాలని, తిరుపతి ఉప ఎన్నికలో సీఎం జగన్‌కు బుద్ధి చెప్పాలని నక్కా ఆనంద్ బాబు పిలుపు ఇచ్చారు.

Updated Date - 2021-04-12T17:49:31+05:30 IST