ప్రభుత్వమే యువతను మాదకద్రవ్యాలకు బానిసల్ని చేస్తోంది: నక్కా ఆనందబాబు
ABN , First Publish Date - 2021-10-18T19:45:47+05:30 IST
ప్రభుత్వమే యువతను మాదకద్రవ్యాలకు బానిసల్ని చేస్తోందని నక్కా ఆనందబాబు విమర్శించారు.
అమరావతి: ప్రశ్నించే గొంతులు మూగబోయేలా చేస్తూ, ప్రభుత్వమే యువతను మాదకద్రవ్యాలకు బానిసల్ని చేస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమార్జన, దోపిడీ కోసం అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల ముఖ్యకేంద్రంగా మార్చారని ఆరోపించారు. హెరాయిన్ దిగుమతులపై విజయవాడలో ఎన్ఐఏ సోదాలు జరిపే వరకు ఏపీ పోలీసులు పట్టించుకోలేదన్నారు. విశాఖ ఏజెన్సీలో గంజాయిపై తెలంగాణ పోలీసులు దాడిచేసే వరకు ఏపీ ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రశ్నించారు.
గంజాయి సాగు, అక్రమరవాణాకు ప్రభుత్వ సహాయ సహకారాలుండబట్టే ఏపీ పోలీస్ శాఖ చేష్టలుడిగి చూస్తోందని నక్కా ఆనందబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చిత్తూరు జిల్లాలో మంత్రి అనుచరులే ఓపీఎమ్లో వినియోగించే ముడిపదార్థాలు సాగుచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సాగవుతున్న గంజాయి, ఇతర మాదకద్రవ్యాల ముడిపదార్థాల సాగు, రవాణా, విక్రయాలన్నీ అధికారపార్టీ అండతోనే సాగుతున్నాయన్నారు. కేంద్ర నిఘా సంస్థలు, మాదకద్రవ్యాల నియంత్రణ విభాగాలు తక్షణమే ఏపీపై దృష్టిసారించాలన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల ముడిపదార్థాలసాగు, ఇతర వ్యవహారాల్లో తలమునకలైనవారి ఆటకట్టించాలని నక్కా ఆనందబాబు అన్నారు.