నామరూప జగత్తు

ABN , First Publish Date - 2020-12-16T07:22:24+05:30 IST

‘ఏది సత్తు (సత్యం)?’ అని శ్వేతకేతు తన తండ్రి ఆరుణిని ప్రశ్నించాడు. దానికాయన.. ‘మట్టిముద్దతో చేయబడిన అనేక రకాలైన వస్తువులు వివిధ రూపాలతో

నామరూప జగత్తు

‘ఏది సత్తు (సత్యం)?’ అని శ్వేతకేతు తన తండ్రి ఆరుణిని ప్రశ్నించాడు. దానికాయన.. ‘మట్టిముద్దతో చేయబడిన అనేక రకాలైన వస్తువులు వివిధ రూపాలతో ఉండి వివిధ పేర్లతో వ్యవహరింపబడతాయి. కానీ, అన్నింటియందు ఉన్నదీ మట్టే. అది మాత్రమే సత్యం. ఇనప వస్తువుల రూపాలు వేరైనా వాటిలో ఉన్న ఇనుమే సత్యం. ఈ విధంగా సత్యమైన దానిని తెలియజెప్పడమే ఉపదేశం.’’ అని వివరించాడు. తండ్రి మాటలు విన్న శ్వేత కేతువు ఆ సత్యాన్నే తనకు ఉపదేశించాల్సిందిగా కోరాడు. అప్పుడు ఆరుణి.. ‘సృష్టికి ముందు ‘సత్తే’ ఉంది. అది ఏకము, అద్వితీయము. ఆ సత్తు అనేక విధాలు కావాలని సంకల్పించింది. మొదట తేజస్సును సృష్టించింది. తేజస్సు అయిన సత్తు జలమును సృష్టించింది. జలమైన సత్తు అన్నమును (పృథివిని) సృష్టించింది. వర్షించిన చోట అన్నము ఉత్పన్నమవుతుంది. జలము వలననే అన్నము. 


అగ్ని, జలము, పృథివి వలననే అండజములు అనగా పక్షి జాతులు, జీవజములు అనగా గర్భకోశము నుండి కలిగే మనుష్య, పశువుల జాతులు, ఉద్భిజ్జములు అనగా భూమిని చీల్చుకొని పుట్టే పర్వతాలు, వృక్షాలు మొదలైనవి ఉద్భవించాయి. సత్యరూపమైన దేవత.. అగ్ని, జలం, పృథివి అను వాటి నుండి ఏర్పడిన బీజములలో జీవునితో పాటు ప్రవేశించి ప్రపంచంలో నామ రూపాలను విస్తరింపజేయాలని ఆలోచించి, ఆ విధంగా జీవునితో పాటు ప్రవేశించి నామరూప జగత్తుకు కారణభూతమైంది.


అగ్ని ప్రజ్వరిల్లుతున్నప్పుడు కనబడే ఎరుపువర్ణం తేజస్సు యొక్క రూపం. తెలుపు వర్ణం జలము యొక్క రూపం. నలుపు పృథ్వి (అన్నము) యొక్క రూపం. ఈ మూడు ఆవరణములనూ వేరు చేస్తే అగ్ని ఉండదు. కేవలం నామమే. తేజస్సు, జలం, పృథ్వి యొక్క వికారం మాత్రమే. ఇదే విధంగా సూర్యునియందలి ఎరుపు వర్ణం తేజస్సు యొక్క రూపం. తెలుపు వర్ణం జలరూపం. నలుపు వర్ణం పృథ్వి రూపం. ఈ మూడు రూపాలను తొలగిస్తే సూర్యుడు లేడు. ఇదే విధంగా చంద్రుడు, విద్యుత్తు (మెరుపు) కూడా పై మూడింటి వికారానికి చెందిన నామాలే. కాబట్టి ప్రపంచంలో పదార్థాలన్నీ తేజస్సు, జలము, పృథ్వి అను వాటి మేళనము వలన ఏర్పడినవే. బ్రహ్మాండమంతా ఈ విధంగానే ఉన్నది. ఇదే సత్యం.’ అని కుమారుడికి బోధించి సందేహం తీర్చాడు.


జక్కని వేంకటరాజం

Updated Date - 2020-12-16T07:22:24+05:30 IST