నందన వనాన్ని తలపించేలా..
ABN , First Publish Date - 2022-08-19T06:21:43+05:30 IST
కొయ్యూరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేవారికి నందనవనానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఆవరణలోని పచ్చని చెట్లు ఆహ్వానం పలుకుతాయి.
- ఆహ్లాదంగా కొయ్యూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణ
- వనం- మనం కార్యక్రమంతో పచ్చదనం
- ఆరేళ్ల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ సౌజన్యంతో నాటిన మొక్కలు ఏపుగా పెరిగిన వైనం
- సిబ్బంది సంరక్షణతో పచ్చదనంతో కళకళ
కొయ్యూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణ పచ్చదనంతో కళకళలాడుతోంది. వివిధ రకాల మొక్కలు ఏపుగా పెరిగి నీడతో పాటు ఆహ్లాదాన్నిస్తున్నాయి. వనం- మనం కార్యక్రమంలో భాగంగా 2016లో ‘ఆంధ్రజ్యోతి’ సౌజన్యంతో నాటిన మొక్కలు ఇప్పుడు అందంగా కనిపిస్తున్నాయి. కార్యాలయ సిబ్బంది సంరక్షణలో కొన్ని మొక్కలు చక్కని ఫలాలను కూడా ఇస్తున్నాయి.
కొయ్యూరు, ఆగస్టు 18: కొయ్యూరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేవారికి నందనవనానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఆవరణలోని పచ్చని చెట్లు ఆహ్వానం పలుకుతాయి. నీడతో పాటు ఆహ్లాదాన్ని పంచుతాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వనం- మనం కార్యక్రమంలో భాగంగా ‘ఆంధ్రజ్యోతి’ సౌజన్యంతో ఇక్కడ వివిధ రకాల మొక్కలు నాటారు. నేరేడు, బాదం, కానుగ, ఉసిరి, దానిమ్మ, సపోటా వంటి సుమారు 200 రకాల మొక్కలు కార్యాలయ సిబ్బంది సహకారంతో నాటించారు. నాటి నుంచి నేటి వరకు విధులు నిర్వహించిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇతర సిబ్బంది కృషితో నాటిన ఏ మొక్క చనిపోకుండా వీఆర్ఏలు చక్కగా సంరక్షించారు. ఎప్పటికప్పుడు మొక్కల చుట్టూ తవ్వించడం, తుప్పలు పెరగకుండా కలుపు తీయించడం, మొక్కలకు సకాలంలో ఎరువు వేయడంతో పాటు వేసవిలో నీటి కొరత లేకుండా చూసేవారు. దీంతో మండల రెవెన్యూ కార్యాలయ ఆవరణ పచ్చని తివాచీ పరిచినట్టుగా మారింది. మొక్కలు ఏపుగా పెరిగి కార్యాలయ ఆవరణ ఆహ్లాదంగా ఉందని తహసీల్దార్ తిరుమలరావు తెలిపారు. వనం- మనం కార్యక్రమంలో భాగంగా నాడు బృహత్తర కార్యక్రమం చేపట్టించి మొక్కలు పెంచేందుకు స్ఫూర్తినిచ్చిన ‘ఆంధ్రజ్యోతి’ని ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు.