దీక్ష విరమణ
ABN , First Publish Date - 2020-11-27T05:35:49+05:30 IST
అబ్దుల్ సలాం పోరాట కమిటీ ఆధ్వర్యంలో సలాం కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతూ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలను ప్రస్తుతానికి విరమిస్తున్నట్లు సలాం పోరాట కమిటీ నాయకులు తెలిపారు.
- అబ్దుల్ సలాం పోరాట కమిటీ స్పష్టత
- రేపు రౌండ్ టేబుల్ సమావేశం
నంద్యాల (ఎడ్యుకేషన్), నవంబరు 26: అబ్దుల్ సలాం పోరాట కమిటీ ఆధ్వర్యంలో సలాం కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతూ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలను ప్రస్తుతానికి విరమిస్తున్నట్లు సలాం పోరాట కమిటీ నాయకులు తెలిపారు. అబ్దుల్ సలాం పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఇక్రా పాఠశాలలో ఉదయం 10 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్వలి, ఐయూఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా తెలిపారు. నంద్యాల పార్లమెంట్ స్థాయిలో వైసీపీ, బీజేపీ, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీక్షలను విరమించేందుకు ప్రధాన ఉద్దేశాన్ని తెలిపారు. రాష్ట్ర హైకోర్టులో ఐయూఎంఎల్ వేసిన ఫిల్ స్వీకరించి సీబీఐ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న డీజీపీ, ఎస్పీ, డీఎస్పీ, పోలీస్ స్టేషన్ అధికారులు సమగ్ర నివేదికను డిసెంబరు 15వ తేదీలోపు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, సలాం కేసులో నిందితులైన సీఐ, హెడ్కానిస్టేబుల్ బెయిల్ రద్దు విచారణ నంద్యాలలోని జిల్లా కోర్టులో 28కి వాయిదా పడిందని తెలిపారు. పోలీస్ అధికారులకు అరెస్టుకు అనుకూలంగా సెక్షన్లు పెట్టినందుకు దీక్షలు విరమించాలని నంద్యాల పోలీస్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేయడంతో కమిటీతో చర్చించి దీక్షలను విరమించినట్లు తెలిపారు అయితే భవిష్యత్తు కార్యాచరణ కోసం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అబ్దుల్ సలాంకు న్యాయం జరిగే విధంగా తీర్మాణాలు చేసి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫి, సయ్యద్ మహబూబ్బాషా, నవీన్, మౌలానా, తదితరులు పాల్గొన్నారు.