ఓ తల్లిగా లోకేష్‌‌ను అలాగే.. పెంచాను: నారా భువనేశ్వరి

ABN , First Publish Date - 2021-12-20T20:30:57+05:30 IST

మహిళలను కించపరచడం సమాజానికి మంచిదికాదని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగు ట్రస్టీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి అన్నారు.

ఓ తల్లిగా లోకేష్‌‌ను అలాగే.. పెంచాను: నారా భువనేశ్వరి

తిరుపతి: మహిళలను గౌరవించే సంస్కృతి ఉండేలా ఓ తల్లిగా లోకేష్‌‌ను పెంచానని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగు ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. సోమవారం భువనేశ్వరి తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్‌తో మాట్లాడారు. ‘‘మా కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో మగాళ్ల గురించి, మహిళల గురించి మాట్లాడడం, కంపెనీ గురించి, సీఎస్ఆర్ ద్వారా చేయాల్సిన సేవల గురించి మాట్లాడుతాం. ఆలయం లాంటి అసెంబ్లీలో ఏమి చర్చించాలో అదే చర్చించాలి. అక్కడ ఎవరూ ఏమి మాట్లాడారో నాకు అనవసరం. నాకు నా భర్త సపోర్ట్ ఉంది. ఆయన కన్నీరు వెనుక నా పట్ల ప్రేమను చూశా. ఎవరి క్షమాపణ నాకు అనవసరం, నా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు వారం, పది రోజులు తట్టుకోలేకపోయా.  లోకేష్ రాజకీయాల్లో మహిళల‌కు గౌరవం పెరిగేలా పనిచేస్తాడు. మహిళలను కించపరచడం సమాజానికి మంచిదికాదు. నాపైన జరిగిన దాడికంటే, మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు దారుణంగా ఉన్నాయి. నాపై జరిగిన దాడి తర్వాత నాలాగే దాడికి గురవుతున్న మహిళల వ్యథ మరింతగా అర్థమైంది. మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలు బాధాకరం. ప్రతి వ్యక్తి తన కుటుంబంలోని తల్లి, చెల్లిని ఎలా చూస్తారో సమాజంలోని మహిళలను అలాగే చూడాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సేవలను విస్తరిస్తాం. ఎక్కడ ఎలాంటి ఆపద, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ట్రస్ట్ సేవలు అందిస్తుంది. ట్రస్ట్ వలంటీర్లు కూడా దేశవ్యాప్తంగా మాతో కలసి పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తాము’’ అని నారా భువనేశ్వరి తెలిపారు. 

Updated Date - 2021-12-20T20:30:57+05:30 IST