మునిసిపల్ స్థలం కబ్జా
ABN , First Publish Date - 2021-06-18T05:52:37+05:30 IST
పట్టణంలో మునిసిపల్ స్థలాలు, మురుగు కాలువలను కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నారు.
ఇనుప కంచెను తొలగించేసిన వైనం
అక్రమార్కుల పంచన మునిసిపల్ అధికారులు
నరసరావుపేట, జూన్ 17: పట్టణంలో మునిసిపల్ స్థలాలు, మురుగు కాలువలను కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నారు. చర్యలు తీసుకొవాల్సిన మునిసిపల్ అధికారులు అక్రమార్కుల పంచన చేరి పోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారు. పురపాలక సంఘం కార్యాలయానికి కూత వేటు దూరంలో విలువైన మునిసిపల్ స్థలాన్ని కబ్జా చేశారు. దీనిలో షాపులు ఏర్పాటు చేశారు. గత తెలుగుదేశం కౌన్సిల్ ఉన్న సమయంలో ఈ స్థలాన్ని కబ్జాకు ప్రయత్నించారు. దీనిని అడ్డుకుని స్థలానికి ఇనుప కంచెను మునిసిపాల్టీ నిర్మించింది. ఈ కంచెను 10 రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు తొలగించి వేశారు. దీనిలో బంకులు ఏర్పాటు చేశారు. ఈ ఆక్రమణల విషయంపై మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ స్థలం అయితే చాలు అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కబ్జా చేస్తున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తుండటం విమర్శలకు దారితీస్తున్నది. ఈ ఆక్రమణపై వివరణ కోరగా చర్యలు తీసుకుంటామని మునిసిపల్ కమీషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు.