ఉత్సాహంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
ABN , First Publish Date - 2021-01-25T06:02:08+05:30 IST
పట్టణంలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో ప్రారంభమైన ఒంగోలు జాతి ఎడ్ల పందాలు ఉత్కంఠగా సాగుతున్నాయి.
నరసరావుపేట రూరల్, జనవరి 24: పట్టణంలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో ప్రారంభమైన ఒంగోలు జాతి ఎడ్ల పందాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, నందికొట్కూరు నియోజక వర్గ వైసీపీ ఇన్చార్జ్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి పోటీలను పరిశీలించారు. శనివారం రాత్రి వరకు జరిగిన పోటీలలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 4,500 అడుగులు, వేగినాటి ఊసరారెడ్డి ఎడ్ల జత 4,500 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. కొండబాల విహాన్ చౌదరి, కోలా పద్మ నాయుడుకు చెందిన ఎడ్ల జత 4,357 అడుగులు లాగాయి. పత్తిపాడుకు చెందిన కాకాని సురేష్ బాబుకు చెందిన ఎడ్ల జత 4,200 అడుగులు లాగాయి. ప్రతిభ కనబరిచిన ఎడ్ల జతలకు బహుమతులను ప్రదానం చేశారు.