టీడీపీ, సీపీఐ గెలిస్తే వైసీపీ అహం అణుగుతుంది: నారాయణ
ABN , First Publish Date - 2021-03-04T20:55:43+05:30 IST
ఓటమి భయంతోనే ఎన్నికల్లో వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు: ఓటమి భయంతోనే ఎన్నికల్లో వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ, గుంటూరులో టీడీపీ, సీపీఐ కూటమిని గెలిపిస్తే వైసీపీ అహం అణుగుతుందని ఆయన అన్నారు. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేని వైసీపీ నేతలు పాదయాత్ర చేయడం ఏంటని ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తున్న నేతలే ఢిల్లీలో పాద పూజ చేస్తున్నారని నారాయణ ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని నారాయణ ఆరోపించారు. విజయవాడ, గుంటూరులో టీడీపీ, సీపీఐ ఫ్రంట్ గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ పొగరు తగ్గుతుందన్నారు. సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని, నవరత్నాలు అమలు చేస్తున్నారని, అందర్నీ మంచిగా ముద్దులు పెట్టుకుంటున్నప్పుడు ప్రజలు వైసీపీకే ఓట్లు వేస్తారని.. మరి బలవంతంగా ఎందుకు ఏకగ్రీవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని నారాయణ ప్రశ్నించారు.