యూపీ అభివృద్ధికి పునాది వేసింది మోదీనే: అమిత్‌షా

ABN , First Publish Date - 2022-02-06T21:34:15+05:30 IST

70 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని 1.82 కోట్ల మంది పేద ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేదు. కానీ నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక వారికి విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పట్ల ప్రధాని మోదీకి గొప్ప విజన్..

యూపీ అభివృద్ధికి పునాది వేసింది మోదీనే: అమిత్‌షా

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధికి పునాది వేసింది ప్రధానమంత్రి నరేంద్రమోదీయేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆదివారం రాష్ట్రంలోని భాగ్‌పట్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బీఎస్పీ, ఎస్పీ హయాంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీజేపీ వచ్చిన తర్వాతనే రాష్ట్రాభివృద్ధి ప్రారంభమైందని అన్నారు. అందుకు నిదర్శనం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణమని అన్నారు.


‘‘70 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని 1.82 కోట్ల మంది పేద ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేదు. కానీ నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక వారికి విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పట్ల ప్రధాని మోదీకి గొప్ప విజన్ ఉంది. ఆ విజన్ నుంచి వచ్చినవే గంగా ఎక్స్‌ప్రెస్‌వే, బుందేల్‌ఖండ్ హైవే, ఈస్టర్న్ పెరిఫేరల్ ఎక్స్‌ప్రెస్‌వేలు’’ అని అమిత్ షా అన్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికలు కొందరికి తమ రాజకీయ భవిష్యత్‌లా చూస్తున్నాయని, వాస్తవానికి ఇవి ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించేవని అమిత్ షా అన్నారు.

Updated Date - 2022-02-06T21:34:15+05:30 IST