ధాన్యం కొనాల్సిన బాధ్యత కేసీఆర్దే.. : నర్సారెడ్డి
ABN , First Publish Date - 2022-04-12T19:36:25+05:30 IST
వరి ధాన్యం కొనకపోతే రాబోయే రోజుల్లో కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టడి చేస్తామని కాంగ్రెస్ సిద్దిపేట అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి అన్నారు.
సిద్దిపేట జిల్లా: వరి ధాన్యం కొనకపోతే రాబోయే రోజుల్లో కేసీఆర్ ఫాంహౌస్ను ముట్టడి చేస్తామని కాంగ్రెస్ సిద్దిపేట అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి అన్నారు. మంగళవారం నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం నుంచి ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి వరకు భారీ ర్యాలీ తీశారు. హైదరాబాద్ - సిద్దిపేట రాజీవ్ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించి , రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేసీఆర్దేనని అన్నారు. ఢిల్లీ వెళ్లి ధర్నా చేయడం వల్ల.. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటేనని నర్సారెడ్డి చెప్పారు.