శ్రీవారి ప్రసాదాల తయారీకి నాసికరం దినుసులు
ABN , First Publish Date - 2022-05-29T09:10:41+05:30 IST
శ్రీవారి ప్రసాదాల తయారీకి నాసికరం దినుసులు
నెయ్యి, జీడిపప్పు, యాలకల్లో నాణ్యతాలోపం
తనిఖీ సందర్భంగా టీటీడీ చైర్మన్ ఆగ్రహం
ప్రభుత్వ ల్యాబ్లో నాణ్యతా పరీక్షలకు ఆదేశం
తిరుపతి, మే 28 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ప్రసాదాల్లో వినియోగిస్తున్న జీడిపప్పు, నెయ్యి, యాలకల్లో నాణ్యతాలోపం బట్టబయలైంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. కాంట్రాక్టర్లు సరఫరా చేసే సరకుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన క్వాలిటీ కంట్రోల్ విభాగం, ఫుడ్ సేఫ్టీ విభాగం, మార్కెటింగ్ విభాగం ఎవరి ఒత్తిళ్ల వల్ల మిన్నకుండిపోయిందనే సందేహం కలిగే పరిస్థితి నెలకొంది. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ను వైవీ సుబ్బారెడ్డి శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ కంపెనీ సరఫరా చేసిన జీడిపప్పులో దుమ్ముతో పాటు విరిగిపోయిన పప్పులు ఎక్కువ శాతం కన్పించాయి. అనంతరం యాలకల నాణ్యతను గురించి అధికారులను అడగ్గా టీటీడీ నిబంధనల మేరకు వాసన లేదని వారు తెలిపారు. నెయ్యి నిల్వలను చూసి వాసన గొప్పగా లేదని అసహనం వ్యక్తం చేశారు. నాణ్యతలేని జీడిపప్పు, యాలకులు, నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ ఆదేశించారు. ఏడాదికి రూ.500 కోట్ల విలువైన జీడిపప్పు, నెయ్యి, యాలకలను టీటీడీ కొనుగోలు చేస్తుందని, వీటి నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావటంతో తనిఖీ చేసినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. నాణ్యత ప్రమాణాల తనిఖీ కోసం శాంపిల్స్ను తిరుమలలోని టీటీడీకి చెందిన క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్తోపాటు, ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్కు కూడా పంపాలని ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు.