సార్వత్రిక సమ్మె సంపూర్ణం

ABN , First Publish Date - 2020-11-27T05:40:40+05:30 IST

కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె సంపూర్ణంగా ముగిసింది.

సార్వత్రిక సమ్మె సంపూర్ణం
అనకాపల్లి: నెహ్రూచౌక్‌లో సీఐటీయూ నాయకుల మానవహారం

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన

అన్ని రంగాల కార్మికుల మద్దతు

వర్షంలోనూ గొడుగులతో ర్యాలీలు, మానవహారాలు


అనకాపల్లి టౌన్‌, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె సంపూర్ణంగా ముగిసింది. అన్ని రంగాల కార్మికులు సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏఐటీయూసీ నాయకులు వైఎన్‌ భద్రం, కోన లక్ష్మణ ఆధ్వర్యంలో వర్షం పడుతున్నా గొడుగులు చేతబట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు. సీఐటీయూ డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మళ్ల సత్యనారాయణ, పీఎన్‌వీ పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ముఠా, కార్మిక సంఘాలు, జీవీఎంసీ కార్మికులు, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ చేశారు. అలాగే నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, నాయకులు ఎ.బాలకృష్ణ, గంటా శ్రీరామ్‌, బుద్ద రామకృష్ణ, ఏసురాజు, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే ఉడ్‌పేటలోని యూనియన్‌ బ్యాంకు వద్ద అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌ డిప్యూటీ సెక్రటరీ కె.హరికృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది నిరసన తెలిపారు. ఎల్‌ఐసీ వద్ద ఉద్యోగులు నిరసన తెలిపి సమ్మెబాట పట్టారు. 


కశింకోటలో...

కశింకోట: మండల కేంద్రంలో ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆందోళన బాట పట్టారు. జాతీయ రహదారిపైన, తహసీల్దారు కార్యాలయం వద్ద ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు డీడీ వరలక్ష్మి, సీపీఎం జిల్లా నేత డి.శ్రీనివాసరావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T05:40:40+05:30 IST