National Herald Case : నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌‌తోపాటు 10 చోట్ల ఈడీ సోదాలు

ABN , First Publish Date - 2022-08-02T18:12:48+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case) విచారణలో దర్యాప్తు ఏజెన్సీ ఈడీ (ED) మరింత దూకుడు పెంచింది.

National Herald Case : నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌‌తోపాటు 10 చోట్ల  ఈడీ సోదాలు

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case) విచారణలో దర్యాప్తు ఏజెన్సీ ఈడీ (ED) మరింత దూకుడు పెంచింది. ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కార్యాలయంతోపాటు మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు(Raids) నిర్వహిస్తోంది. కేసు విచారణలో కాంగ్రెస్(Congress) అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)ని ప్రశ్నించిన అనంతరం ఈడీ ఈ మేరకు రంగంలోకి దిగింది. గత నెల జులైలో సోనియాని ఈడీ దాదాపు 12 గంటలు ప్రశ్నించింది. 100కిపైగా ప్రశ్నలు సంధించింది. అంతకుముందు రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని కూడా 5 రోజులకుపైగా 150కిపైగా ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే.


నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక వ్యవహారం ఇదీ !

ఏఐసీసీ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ప్రస్తుత ‘యంగ్‌ ఇండియన్‌’ ప్రైవేటు లిమిటెడ్‌ అధీనంలో ఉంది. దానిని ప్రచురించే సంస్థ పేరు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌). యంగ్‌ ఇండియన్‌ కంపెనీకి రాహుల్‌, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు. అందులో చెరో 38 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ కేవలం రూ.50 లక్షలే చెల్లించి.. ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.90.25 కోట్ల రుణాన్ని రికవరీ చేసే హక్కు పొందడంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి 2013లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. సోనియా, రాహుల్‌ తదితరులు మోసంతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ఏడాది ఈడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఇటివలే సోనియా, రాహుల్‌ను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, పవన్‌ బన్సల్‌ను ఇదివరకే ఈడీ విచారించింది. ఎలాంటి అవకతవకలూ లేవని.. యంగ్‌ ఇండియన్‌ కంపెనీ లాభదాయక సంస్థ కాదని కాంగ్రెస్‌ అంటోంది. ఏజేఎల్‌కు రూ.800 కోట్ల ఆస్తులు ఉన్నాయని.. యంగ్‌ ఇండియన్‌ లాభదాయక సంస్థ కాకపోతే దాని భూములు, భవనాలను అద్దెకు ఇవ్వడం వంటి వాణిజ్య కార్యకలాపాలు ఎలా చేపడుతోందని ఈడీ సందేహిస్తోంది.

Updated Date - 2022-08-02T18:12:48+05:30 IST