సౌదీలో తొలిసారి క్రిస్మస్ వేడుకలు
ABN , First Publish Date - 2021-12-27T10:07:06+05:30 IST
సౌదీలో తొలిసారి క్రిస్మస్ వేడుకలు
భారత దౌత్య కార్యాలయంలో ఏర్పాటు
తెలుగు ప్రవాసీయుల ప్రముఖ పాత్ర
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఇస్లాం దేశం సౌదీ అరేబియాలో అన్యమత ప్రచారం, ఇతర మతాల పండుగలు నిషేధం. ఒకవేళ పండుగలు జరుపుకొన్నా దొంగతనంగా బిక్కుబిక్కుమంటూ చేసుకోవాల్సిన పరిస్థితి. పోలీసులు దాడి చేసి మహిళలు, చిన్నారులను సైతం అరెస్టు చేసిన అనుభవాలున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ క్రైస్తవులంతా సగౌరవంగా, వైభవంగా క్రిస్మస్ పండుగ చేసుకున్న అత్యంత అరుదైన సన్నివేశం ఈ దేశంలో చోటు చేసుకుంది. చరిత్రలోనే తొలిసారిగా సౌదీ అరేబియాలోని భారతీయ దౌత్యకార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవులు ప్రముఖ పాత్ర పోషించడం మరో విశేషం. అత్యున్నత స్థాయి దౌత్యవేత్త కాన్సుల్ జనరల్ మోహమ్మద్ షాహీద్ ఆలం చొరవకు తోడు, యువరాజు మోహమ్మద్ బిన్ సల్మాన్ చేపట్టిన సంస్కరణల్లో భాగంగా సౌదీలో తొలిసారిగా ఈ వేడుకను బహిరంగంగా నిర్వహించారు. జెద్ధా నగరంలోని భారత దౌత్య కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కర్నూలుకు చెందిన హానుక్ అభినయ్ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. కృష్ణా జిల్లాకు చెందిన అనిల్ కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ మోహమ్మద్ షాహీద్ ఆలం మాట్లాడుతూ.. సౌదీలో భారతీయుల ప్రతిష్ఠను ఇనుమడింపచేయడంలో క్రైస్తవ నర్సుల పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. ‘ఆజాదీకా అమృత్ మహత్సోవ్’ కార్యక్రమంలో భాగంగా అందరినీ భాగస్వామ్యం చేసి క్రిస్మస్ పండుగ నిర్వహించడం పట్ల హర్షంవ్యక్తం చేశారు. తెలుగునాటకంటే కూడా గొప్పగా క్రిస్మస్ పండుగ చేసుకున్నంత అనుభూతి కలిగిందని తెలుగు వారు చెప్పారు.