సీతామహాలక్ష్మికి జాతీయ సేవా ధార్మిక అవార్డు

ABN , First Publish Date - 2022-07-03T06:32:10+05:30 IST

అవయవ దానాన్ని జాతీయ ఉద్యమ స్థాయికి తీసుకెళ్లిన గూడూరు సీతామహాలక్ష్మి హైదరాబాద్‌కు చెందిన లతారాజా ఫౌండేషన్‌ జాతీయ సేవా ధార్మిక అవార్డుకు ఎంపికయ్యారు.

సీతామహాలక్ష్మికి జాతీయ సేవా ధార్మిక అవార్డు
గూడూరు సీతామహాలక్ష్మి

అనకాపల్లి, జులై 2 (ఆంధ్రజ్యోతి) : అవయవ దానాన్ని జాతీయ ఉద్యమ స్థాయికి తీసుకెళ్లిన గూడూరు సీతామహాలక్ష్మి హైదరాబాద్‌కు చెందిన లతారాజా ఫౌండేషన్‌ జాతీయ సేవా ధార్మిక అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును అనంతపురంలో ఈనెల 23న ప్రదానం చేయనున్నారు. రూ.50 వేల నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని ఆమెకు అందజేయనున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన సీతామహాలక్ష్మి 2008లో సావిత్రిభాయి పూలే ఎడ్యుకేషన్‌, చారిటిబుల్‌ ట్రస్టును ప్రారంభించారు. ‘మరణించినా జీవించండి’ అన్న నినాదంతో శరీర, అవయవ దాన కార్యక్రమానికి నాంది పలికారు. ఈమె ప్రేరణతో ట్రస్టుకు చెందిన 34 మంది సభ్యులు మరణానంతరం మొత్తం శరీర అవయవాలను దానం చేస్తున్నట్టు వీలునామాలు రాయడం 2008 సంవత్సరంలో సంచలనం అయింది. 1983లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి సారా ఉద్యమం, అక్షరాస్యత ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొని ఆమె పలు అవార్డులు పొందారు. అఖిల భారత అవయవ దాన సంఘ అధ్యక్షురాలిగా అవయవ దానాలను ప్రోత్సహిస్తూ ఎందరికో అవయవాలు సమకూరేలా కృషి చేస్తున్నారు.

Updated Date - 2022-07-03T06:32:10+05:30 IST