ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
ABN , First Publish Date - 2022-01-26T05:09:57+05:30 IST
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పలువురు సీనియర్ ఓటర్లను సత్కరించారు. నిజాయితీగా ఓటు హక్కు వినియోగిస్తామని అధికారులు ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు.
సూళ్లూరుపేట, జనవరి 25 : స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పలువురు సీనియర్ ఓటర్లను సత్కరించారు. నిజాయితీగా ఓటు హక్కు వినియోగిస్తామని అధికారులు ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. ఎన్నికల డిప్యూటీ తహసీల్దారు యువరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక మున్సిపల్ కమిషనర్ నరేంద్రకుమార్, ఇన్చార్జి ఎంపీడీవో వినీల్కుమార్, బీఎల్వోలు, పలువురు ఓటర్లు పాల్గొన్నారు.
నాయుడుపేట టౌన్ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. మంగళవారం జాతీయ ఓటర్ల సందర్భంగా విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకటరామిరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: ఓటు వజ్రాయుధం... అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు అవసరమని మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్బాబు, తహసీల్దారు సుభద్ర అన్నారు. స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో మంగళవారం జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ సభలో వారు ప్రసంగించారు. అర్హులైన వారు ఏటా తమ ఓటు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం విస్తృత వెసులుబాటు కల్పించిందన్నారు. ఇంకా అర్హులైన వారు ఓటర్లుగా నమోదు చేయించుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు సోమా వెంకటసుబ్బయ్య, హరీష్ తదితరులు మాట్లాడుతూ పాలకులను నిర్ణయించే శక్తి ఓటర్లకే ఉందని గుర్తు చేశారు. సీనియర్ సిటిజన్లకు సన్మానం చేసి, ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ సుజిత, ఏఎస్వో, బిఎల్వోలు, పలువురు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
సంగం : స్థానిక తహసీల్దారు కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.తహసీల్దారు నిర్మలానందబాబా ఓటు గొప్పదనాన్ని వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సూపరిటెండెంట్ జ్యోతిర్లిక్ష్మి, డిప్యూటీ తహసీల్దారు లక్ష్మిప్రసన్న, సిబ్బంది పాల్గొన్నారు.
చేజర్ల : స్థానిక తహసీల్దారు శ్యామసుందరరాజ జాతీయ ఓటర్ల దినోత్సవం సభలో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఓటు హక్కును పొందాలని తెలిపారు. అనంతరం ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో డీటీ విజయ్, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.