రహానె అడిగాడు.. సరేనన్నా!
ABN , First Publish Date - 2021-01-24T10:12:05+05:30 IST
గాబా టెస్ట్ సందర్భంగా గాయం కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యానని టీమిండియా పేసర్ నవ్దీప్ సైనీ చెప్పాడు.
న్యూఢిల్లీ: గాబా టెస్ట్ సందర్భంగా గాయం కావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యానని టీమిండియా పేసర్ నవ్దీప్ సైనీ చెప్పాడు. ఇలాంటి గొప్ప అవకాశం మళ్లీ రాదేమోనని బాధపడినట్టు తెలిపాడు. కానీ, కెప్టెన్ రహానె బౌలింగ్ చేస్తావా? అని అడగడంతో మరో ఆలోచన లేకుండా సిద్ధమయ్యానన్నాడు. నొప్పిని భరిస్తూనే రెండో ఇన్నింగ్స్లో ఐదు ఓవర్లు బౌలింగ్ చేశానని చెప్పాడు. ఆస్ట్రేలియా టూర్లోని సిడ్నీ మ్యాచ్లో సైనీ టెస్ట్ల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ‘
ఇలాంటి అవకాశం కోసమే ఎంతో కాలం ఎదురుచూశా. కానీ, చాన్స్ వచ్చే సరికి ఇలా జరగడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యా. నాలుగో టెస్ట్కు ముందు వరకు బాగానే ఉన్నా. కానీ, తొలి ఇన్నింగ్స్లో హఠాత్తుగా గాయపడ్డాన’ని సైనీ చెప్పాడు. పేసర్ సిరాజ్ తనకు మంచి మిత్రుడని, ఇద్దరం కలసి భారత్-ఏ జట్టుకు ఆడినట్టు సైనీ తెలిపాడు. ‘నా తొలి మ్యాచ్లో సిరాజ్ నాతోనే ఉన్నాడు. వేగం ముఖ్యమే అయినా.. లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేయాలని సూచించాడు. సిరాజ్ భిన్నమైన బౌలర్. తండ్రి మరణించినా.. జట్టుతోనే ఉండి అంకితభావాన్ని ప్రదర్శించాడు’ అని నవ్దీప్ కొనియాడాడు.