కెప్టెన్ అమరీందర్ ఓ సత్తు గిన్నె : సిద్ధూ

ABN , First Publish Date - 2021-10-27T23:33:55+05:30 IST

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్

కెప్టెన్ అమరీందర్ ఓ సత్తు గిన్నె : సిద్ధూ

చండీగఢ్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓ సత్తు గిన్నె వంటివారని ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ ఎద్దేవా చేశారు. ఓ కథలోని ద్రోహి జైచంద్‌గా ప్రజలు ఆయనను గుర్తుంచుకుంటారన్నారు. ఆయన తనను తాను కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను అమ్మేశారని ఆరోపించారు. 


కెప్టెన్ సింగ్ చేతిని ఎవరో మెలిపెట్టి ఒత్తిడి తెస్తున్నారని, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నియంత్రణలో ఉన్న విధేయుడైన ముఖ్యమంత్రిగా ఆయన తనను తాను కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను అమ్మేశారని సిద్ధూ ట్విటర్ వేదికగా బుధవారం ఆరోపించారు. పంజాబ్‌లో అభివృద్ధి, న్యాయం జరగకుండా అడ్డుకున్న వ్యతిరేక శక్తి అని మండిపడ్డారు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్ చండీగఢ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతుండగా సిద్ధూ ఈ ట్వీట్లు చేశారు. వీరిద్దరి మధ్య చాలా కాలం నుంచి విభేదాలు ఉన్నాయి. 2019 జూలైలో కెప్టెన్ సింగ్ మంత్రివర్గం నుంచి సిద్ధూ వైదొలగారు. రెండేళ్ళ అనంతరం సిద్ధూ పీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. తిరుగుబాట్లు పెరగడంతో గత నెలలో ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ సింగ్ రాజీనామా చేశారు. తాను స్వంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని కెప్టెన్ బుధవారం ప్రకటించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 


Updated Date - 2021-10-27T23:33:55+05:30 IST