ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే నక్సలైట్లు మళ్లీ వస్తారు: వీహెచ్‌

ABN , First Publish Date - 2021-03-01T09:01:31+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే నక్సలైట్లు మళ్లీ పుట్టుకువస్తారని కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేటీకరించిందని, బ్యాంకులను కూడా వదిలిపెట్టడం లేదని ధ్వ

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే నక్సలైట్లు మళ్లీ వస్తారు: వీహెచ్‌

కవాడిగూడ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే నక్సలైట్లు మళ్లీ పుట్టుకువస్తారని కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేటీకరించిందని, బ్యాంకులను కూడా వదిలిపెట్టడం లేదని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద తెలంగాణ ఓబీసీ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వీహెచ్‌ మాట్లాడారు. నక్సలైట్లు పెరిగిపోతే దానికి మోదీ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని, రాష్ట్ర డీజీపీ కూడా అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, క్రిమిలేయర్‌ను పూర్తిగా రద్దు చేయాలని ఆయన కోరారు. ప్రధాని మోదీ బీసీలకు కమిషన్‌ ఏర్పాటు చేసినప్పటికీ చట్టబద్ధత కల్పించలేదని అఖిల భారత ఓబీసీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి జి కరుణానిధి అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సెంట్రల్‌ కమిటీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి, అఖిల భారత ఓబీసీ సమాఖ్య ఉపాధ్యక్షుడు దానకర్ణాచారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T09:01:31+05:30 IST