హైదరాబాద్ కేంద్రంగా ఎన్సీబీ జోన్
ABN , First Publish Date - 2022-05-10T08:48:31+05:30 IST
మాదక ద్రవ్యాల సరఫరా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది.
ప్రస్తుతమున్న సబ్ జోన్ స్థాయి పెంపు.. కేంద్రం ప్రణాళిక
న్యూఢిల్లీ, మే 9(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల సరఫరా కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ కేంద్రంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోన్ ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఎన్సీబీ సబ్ జోన్ ఉంది. దీనిని జోన్ స్థాయికి పెంచాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మాత్రమే కాక.. దేశవ్యాప్తంగా ఉన్న 12 సబ్ జోన్లను జోన్ స్థాయికి పెంచనున్నట్లు సమాచారం. అందులో భాగంగా 3 వేల పోస్టుల భర్తీకి ఎన్సీబీ కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్ర హోం, ఆర్థిక శాఖ చర్చల అనంతరం 1,800 పోస్టుల భర్తీని అనుమతి లభించింది. వీటికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. కాగా, సాంకేతికతను వినియోగించుకొని డ్రగ్స్ రవాణా చేస్తున్నారని, ఇది దేశానికి ముప్పుగా మరిందని, డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం శాఖ గణాంకాల ప్రకారం పలు ప్రభుత్వ ఏజెన్సీలు 2011-14 మధ్య రూ.604 కోట్ల విలువైన డ్రగ్స్ను సీజ్ చేస్తే.. 2018-21 మధ్య ఏకంగా అంతకు మూడు రెట్లు (రూ.1881 కోట్లు) విలువైన డ్రగ్స్ను పట్టుకున్నాయి.