మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-02-23T21:11:06+05:30 IST
అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్తో పాటు పరారీలో ఉన్న ఉగ్రవాద ఫైనాన్సర్ దావూద్ ఇబ్రహీం, అతని సోదరుడు అనీస్, ఇక్బాల్, సహాయకుడు చోటా షకీల్, ఇతరులపై నమోదైన కేసులో ఈడీ ముందు హాజరు కావాలని నవాబ్ మాలిక్కు ఇదివరకే సమన్లు జారీ అయ్యాయని సమాచారం..
ముంబై: మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం, ఆయన అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్ను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి బుదవారం ఉదయం 6 గంటలకు నవాబ్ మాలిక్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు.. ఓ గంట సేపు ప్రశ్నించిన అనంతరం 7:30 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో నవాబ్ మాలిక్ ఈడీకి సహకరించలేదని సమాచారం.
అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్తో పాటు పరారీలో ఉన్న ఉగ్రవాద ఫైనాన్సర్ దావూద్ ఇబ్రహీం, అతని సోదరుడు అనీస్, ఇక్బాల్, సహాయకుడు చోటా షకీల్, ఇతరులపై నమోదైన కేసులో ఈడీ ముందు హాజరు కావాలని నవాబ్ మాలిక్కు ఇదివరకే సమన్లు జారీ అయ్యాయని సమాచారం. ఈ విషయమై గత వారం ఈడీ వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈడీ రైడ్లను ఆధారం చేసుకుని ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దావూద్ ఇబ్రహీం సహాయకుడితో పాటు ఆయన సోదరి హసీనా పార్కర్తో నవాబ్ మాలిక్ డీల్స్ కుదుర్చుకున్నట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయి.
నవాబ్ మాలిక్ అరెస్ట్పై మహావికాస్ అగాడీ నేతలు బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు నవాబ్ మాలిక్ను ఈ విధంగా టార్గెట్ చేస్తారని తమకు తెలుసునని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఆయనపై కేసు గురించి తనకు తెలియదని, అయితే ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేయడానికి దావూద్ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పని చేసిన కాలంలో తనకు కూడా అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారన్నారు. పాతికేళ్ల తర్వాత అదే చిట్కాను ఉపయోగిస్తున్నారన్నారు.
మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ కోట్ల విలువైన ఆస్తులను 30 లక్షల రూపాయలకు గోల్మాల్ చేశారని, సర్దార్ శవాలీ ఖాన్, సలీమ్ పటేల్ల నుంచి ఈ ఆస్తులను నవాబ్ మాలిక్ కొనుగోలు చేశారని ఆరోపించారు. అయితే నవాబ్ మాలిక్కు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో ఏమైనా వ్యాపార లావాదేవీలు జరిగాయా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.