ప్రధాని ఇంటి ముందు సర్వమత ప్రార్థనలకు అనుమతి కోరిన ఎన్సీపీ
ABN , First Publish Date - 2022-04-25T18:20:00+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వెలుపల హనుమాన్ చాలీసా పఠనం, నమాజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని..
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వెలుపల హనుమాన్ చాలీసా పఠనం, నమాజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్సీపీ ముంబై నార్త్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫహ్మిద హసన్ ఖాన్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రికి ఆమె లేఖ రాశారు. ఢిల్లీ లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని అధికారిక నివాసం వెలుపల నమాజ్, హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా, నమోకార్ మంత్ర, తదితరాలను పఠించాలని తాను కోరుకుంటున్నట్టు ఆమె చెప్పారు. తన ఇంటిలో కూడా హనుమాన్ చాలీసా పఠిస్తానని, దుర్గాపూజ చేస్తానని అన్నారు.
దీనిపై హస్సన్ ఖాన్ ఓ ట్వీట్ చేస్తూ, ప్రధాని నివాసం వెలుపల సర్వమత ప్రార్థనలు చేసేందుకు తనను అనుమతించాలంటూ హోం మంత్రి అమిత్షా అనుమతి కోరినట్టు చెప్పారు. హిందుత్వ, జైనిజం వల్ల ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆకలిచావులు తగ్గి దేశానికి ప్రయోజనం చేకూరుతుందంటే సర్వమత ప్రార్థనలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.