women safety: ఇండియాలో మహిళలకు రక్షణ ఎంత?
ABN , First Publish Date - 2022-08-31T02:14:00+05:30 IST
దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై పలు రకాలుగా హింస జరుగుతోంది. ‘ఆకాశంలో సగం’గా చెప్పే ‘ఆమె’ నిత్యం
న్యూఢిల్లీ: దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై పలు రకాలుగా హింస జరుగుతోంది. ‘ఆకాశంలో సగం’గా చెప్పే ‘ఆమె’ నిత్యం దాడికి గురవుతూనే ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో స్త్రీకి గౌరవనీయమైన స్థానం ఉంది. అలాంటి చోట మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తే ఆవేదన కలగక మానదు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది (2021)లో మన దేశంలో మహిళలపై దాడులు 15.3 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి లక్షమంది జనాభాలో 8 శాతం మంది ఇలాంటి నేరాలను ఎదుర్కొంటున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
ఎస్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. 2020లో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి 3,71,503 కేసులు నమోదు కాగా, గతేడాది ఈ సంఖ్య ఏకంగా 4,28,278 పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలో 56,775 కేసులు పెరిగాయన్నమాట. అలాగే, ప్రతి లక్షమంది జనాభాలో మహిళలపై నేరాల రేటు 2020లో 56.5 శాతం ఉండగా, 2021లో 64.5 శాతానికి పెరిగింది. ఇలాంటి వాటిలో 31.8 శాతం కేసులకు కారణం భర్త, లేదంటే అతడి బంధువులుగా నివేదిక తెలిపింది. వీటిని ‘భర్త, అతడి బంధువుల క్రూరత్వం’ వర్గం కింద చూపించింది.
ఆ తర్వాతి వాటిలో మహిళలపై ఆగ్రహం పెంచుకుని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడులు 20.8 శాతంగా ఉన్నాయి. కిడ్నాప్, అపహరణలు 17.6 శాతం ఉండగా, అత్యాచార ఘటనలు 7.4 శాతంగా ఉన్నాయి. 2021లో 29 వేల కేసులతో (168.3 శాతం) అసోం నేరాల రేటులో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత ఒడిశా, హర్యానా, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. కేసుల పరంగా చూస్తే 56,083 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి రాష్ట్రాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా ఉన్నాయి. అతి తక్కువగా 2021లో నాగాలాండ్లో 54 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
మహిళలపై జరుగుతున్న క్రైం రేట్ పరంగా చూస్తే 5.5 శాతంతో నాగాలాండ్ టాప్ ప్లేస్లో ఉంది. ఇక, గతేడాది ఢిల్లీలో నేరాల రేటు అత్యధికంగా 147.6 శాతం నమోదైంది. నమోదైన కేసుల సంఖ్యలోనూ దీనిదే అగ్రస్థానం. 2 మిలియన్లు అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో జైపూర్ టాప్ ప్లేస్లో ఉంది. ఇక్కడ నేరాల రేటు 194 శాతంగా ఉండగా, 147.6 శాతంతో ఢిల్లీ ఆ తర్వాతి స్థానంలో ఉంది.