
ఢాకా: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు భారత అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్ మంత్రి హసన్ మహ్మద్ అన్నారు. బంగ్లాదేశ్ కానీ ఇతర ఇస్లాం దేశాలు కానీ తమ ఆకర్షణ కోసం ఈ అంశాన్ని ఉపయోగించుకోవని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ అంశంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం కిమ్మనకుండా కూర్చుందని వస్తున్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను బంగ్లాదేశ్ సహించదని అయితే సదరు వ్యక్తుల్ని పార్టీ నుంచి తొలగించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం స్వాగతించాల్సిన అంశమని మహ్మద్ అన్నారు. తాజాగా ఆయన ఇండియన్ జర్నలిస్టులను కలిశారు. ఈ సందర్భంలోనే భారత్లో తీవ్ర వివాదంగా మారిన మహ్మద్ ప్రవక్త అంశంపై ఆయనను జర్నలిస్టులు ప్రశ్నించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి ఖండించినట్లు ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదనే విమర్శలు అనేకం ఉన్నాయి. వీటిపై ఆయన స్పందిస్తూ ‘‘ఇలాంటి వాటిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కానీ, బంగ్లాదేశ్ కానీ ఎప్పుడు సహనం వహించదు. నేను ఒక బహిరంగ సభలోనే ఖండించాను’’ అని అన్నారు. అయితే ఇది బంగ్లాదేశ్ బయటి సమస్య అయినందున ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదని మహ్మద్ సమాధానం చెప్పారు.
ఇవి కూడా చదవండి