3 వేల కోట్లు కావాలి: ‘సీరం’ సీఈఓ పూనావాలా

ABN , First Publish Date - 2021-04-07T02:44:03+05:30 IST

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా టీకా ఉత్పత్తి సామర్థ్యం పెంచాలంటే 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ‘సీరం’ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తాజాగా పేర్కొన్నారు.

3 వేల కోట్లు కావాలి: ‘సీరం’ సీఈఓ పూనావాలా

న్యూఢిల్లీ: సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు పెంచాలంటే 3 వేల కోట్ల పెట్టుబడి అవసరమని ‘సీరం’ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తాజాగా పేర్కొన్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీకా ఉత్పత్తి పెంచాలన్న అభిప్రాయాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇక దేశంలో అత్యధికంగా వినియోగిస్తున్న కొవిషీల్డ్ కరోనా టీకాను సీరమ్ తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ టీవీ ఛాన‌ల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అదర్ పూనావాలా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకాలపై ప్రస్తుతమున్న స్థాయి కంటే మరింత ఎక్కవగా లాభాలు ఆర్జించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. తద్వారా ఈ నిధులను టీకా ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు వినియోగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 


‘ప్రస్తుతం ‘సీరం’ ప్రభుత్వానికి భారీ సబ్సీడీపై ఒక్కో టీకాను కేవలం రూ. 150-160కే సరఫరా చేస్తోంది. అయితే టీకా సగటు ధర మాత్రం దాదాపు 20 డాలర్లు(రూ. 1500) ఉంది. మోదీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు మేం సబ్సీడీ ధరలకు టీకా సరఫరా చేస్తున్నాం. దీనినర్థం మాకు అసలు లాభాలేలేవని కాదు. కానీ ఇంతకంటే ఎక్కువగా లాభాలు రావాల్సిర ఉంది. మళ్లీ పెట్టుబడి పెట్టేందుకు ఇదే కీలకం. ప్రస్తుతం టీకా సామర్థ్యం పెంచేందుకు రూ. 3 వేల కోట్లు అవసరం. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి 85 రోజులు పట్టొచ్చు. కాబట్టి మూడు నెలల లోపలే మేం టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ఇప్పటికే తాము కేంద్రానికి లేఖ రాశామని, ఇది కుదరని పక్షంలో లోన్ల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం సీరం రోజుకు రెండు మిలియన్ డోసులను సరఫరా చేస్తోందని అదర్ చెప్పారు. ఇప్పటివరకూ ప్రభుత్వానికి వంద మిలియన్ డోసులను ఇచ్చామన్నారు. ప్రస్తుతం నెలకు 60 నుంచి 60 మిలియన్ డోసుల ఉత్పత్తి జరుగుతోందని, దీన్ని 100 మిలియన్ డోసులకు పెంచాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. తమ కర్మాగారంలో జనవరిలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా టీకా సరఫరాలో కొంత ఆలస్యం జరిగిందని కూడా అదర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-07T02:44:03+05:30 IST