‘నీట్’కు 1.42 లక్షల మందికి పైగా దరఖాస్తు
ABN , First Publish Date - 2022-05-28T14:54:52+05:30 IST
నేషనల్ ఎలిజబుల్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసేందుకు రాష్ట్రంలో 1.42 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్
పెరంబూర్(చెన్నై): నేషనల్ ఎలిజబుల్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసేందుకు రాష్ట్రంలో 1.42 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ నిర్వహిస్తున్నారు. 2022-23వ విద్యా సంవత్సరానికి సంబంధించిన నీట్ జూలై 17న జరుగనుంది. ఈ పరీక్ష రాసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు నమోదు ప్రక్రియ ఏప్రిల్ 26న ప్రారంభమై ఈ నెల 20వ తేది వరకు కొనసాగింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 18,72,339 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 10,64,606 మహిళలు, 8,07,711 మంది పురుషులు కాగా, 12 మంది హిజ్రాలున్నట్లు అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈసారి 2,57,562 మంది అభ్యర్థులు అదనంగా దరఖాస్తు చేశారు. కాగా, తమిళనాడు నుంచి 1,42,286 మంది నీట్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇక, తమిళంలో పరీక్ష రాసేందుకు 31,803 మంది దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యా కళాశాలల్లో అందుబాటులో ఉన్న 91,415 ఎంబీబీఎస్, 26,949 బీడీఎస్ సీట్లు, సిద్ధ, యునానీ, హోమియో తదితర ఇతర ఆయుష్ వైద్య విద్యా కోర్సులకు సంబంధించి 50,720 సీట్లకు నీట్ జరుగనుంది.