రష్యాతో చర్చలు రాన్రానూ మరింత సంక్లిష్టం : జెలెన్స్కీ
ABN , First Publish Date - 2022-03-17T17:47:06+05:30 IST
యుద్ధం నేపథ్యంలో రష్యాతో చర్చలు రాన్రానూ సంక్లిష్టమవుతున్నాయని
కీవ్ : యుద్ధం నేపథ్యంలో రష్యాతో చర్చలు రాన్రానూ సంక్లిష్టమవుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. ఆయన ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రష్యాతో చర్చలు చాలా కష్టంతో కూడుకున్నవని చెప్పారు. ఏ సాయుధ సంఘర్షణనైనా చర్చలతో ఆపవచ్చునని చెప్పారు. ‘‘అన్నిటి కన్నా ముఖ్యమైనది ఏమిటంటే, చర్చలు జరుగుతున్నాయి. అవి చాలా సంక్లిష్టమైనవి’’ అని జెలెన్స్కీ చెప్పారు.
ఉక్రెయిన్లో శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. రష్యాపై మరింత ఒత్తిడి పెరగడం కోసం, ఉక్రెయిన్కు మరింత ఎక్కువ మద్దతు లభించడం కోసం తాము పోరాడతామని తెలిపారు. గురువారం ఉదయం జర్మన్ పార్లమెంటును ఉద్దేశించి తాను ప్రసంగిస్తానని చెప్పారు. ఉమ్మడి విజయం కోసం కృషి చేస్తానన్నారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్ను వేగంగా పునర్నిర్మిస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ కృషిని ప్రారంభించామన్నారు. ఎటువంటి నష్టం జరిగినప్పటికీ, పునర్నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ప్రపంచాన్ని, అదేవిధంగా తమ స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని ప్రేరేపించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాలు ఇప్పటికే నాలుగుసార్లు చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో కొంత వరకు పురోగతి సాధించామని ఇరు దేశాల ప్రతినిధులు చెప్పారు. అయితే ఆ పురోగతి గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు.
ఇదిలావుండగా, ఉక్రెయిన్లోని ఖార్కివ్ నగరంలో ఉన్న ఓ పాఠశాలపై రష్యా దళాలు బాంబులు కురిపించినట్లు స్థానిక మీడియా గురువారం తెలిపింది. ధ్వంసమైన భవనం చిత్రాలను చూపించింది.
రష్యా దళాలు నిర్బంధించిన మెలిటోపోల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ విడుదలయ్యారు. మార్చి 11న రష్యా దళాలు నిర్బంధించిన ఇవాన్ను గురువారం విడుదల చేశాయని ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. తమ దళాలు నిర్బంధించిన తొమ్మిది మంది రష్యా సైనికులను విడుదల చేయడంతో మేయర్ను రష్యా దళాలు విడుదల చేసినట్లు తెలిపారు.
ఇదిలావుండగా, ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని రష్యాను అంతర్జాతీయ న్యాయస్థానం బుధవారం ఆదేశించింది.