నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవం

ABN , First Publish Date - 2022-06-10T15:25:26+05:30 IST

చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవాన్ని స్థానిక నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నారు. జూలై 28న జరిగే ఆ వేడుకల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ 44వ

నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవం

చెన్నై, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవాన్ని స్థానిక నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించనున్నారు. జూలై 28న జరిగే ఆ వేడుకల్లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ 44వ అంతర్జాతీయ చెస్‌ ఒలంపియాడ్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు సచివాలయంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో డీజీపీ శైలేంద్రబాబు, క్రీడాశాఖ మంత్రి మెయ్యనాధన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, క్రీడా శాఖ కార్యదర్శి అపూర్వా, ఒలంపియాడ్‌ ప్రత్యేక అధికారి తారేష్‌ అహమ్మద్‌, చెస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సంజయ్‌ కపూర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశవిదేశాల నుంచి పోటీలలో పాల్గొనేందుకు వచ్చే చెస్‌ క్రీడాకారులు, పోటీలను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు కల్పించాల్సిన వసతులపై సమగ్రంగా చర్చించారు. ఈ పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ప్రముఖ చారిత్రక పర్యాటక ప్రాంతం మహాబలిపురంలో చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు జూలై 28 నుంచి ఆగస్టు 10 వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రస్తుతం మహాబలిపురం క్రీడా ప్రాంగణం వద్ద చేపడుతున్న ఏర్పాట్లు, క్రీడాకారులకు కల్పించనున్న బస వసతులు గురించి స్టాలిన్‌ అధికారుల వద్ద అడిగి తెలుసుకున్నారు.


హోటళ్లలో కఠిన నిబంధనలు

ఇదిలా ఉండగా చెస్‌ ఒలంపియాడ్‌ సందర్భంగా క్రీడాకారులు బసచేయడానికి మహాబలిపురం, చుట్టుపక్కలి ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్టార్‌ హోటళ్ళలో కఠిన నిబంధనలు అమలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మహాబలిపురం, ఓఎమ్మార్‌, ఈసీఆర్‌  ప్రాంతాల్లో ఉన్న స్టార్‌ హోటళ్ళన్నీ క్రీడాకారుల కోసం ప్రభుత్వం బుక్‌ చేసింది. ఈ హోటళ్ల వద్ద క్రీడాకారులు, హోటల్‌ సిబ్బందికి ముందస్తు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ హోటళ్ళ వద్ద కరోనా నిరోధక నిబంధనలు తుచ తప్పకుండా పాటించేలా చర్యలు చేపట్టాలని హోటళ్ల నిర్వాహకులకు అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. క్రీడాకారులకు సేవలందించనున్న హోటల్‌ సిబ్బంది తప్పకుండా రెండు డోస్‌ల కరోనా నిరోధక టీకాలు వేసుకుని ఉండాలని కూడా తెలిపారు. హోటళ్ల వద్ద అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలని, వైద్యనిపుణులు కూడా 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2022-06-10T15:25:26+05:30 IST