కుక్కపేరుతో గొడవ.. చివరకు వివాదం పెరిగి యజమానికి నిప్పు పెట్టిన పొరుగింటి వ్యక్తి
ABN , First Publish Date - 2021-12-23T06:04:50+05:30 IST
పొరుగింట్లో ఉండే పెంపుడు కుక్కపేరు నచ్చకపోవడంతో ఆ కుక్క యజమానితో పక్కింటి వ్యక్తి గొడవపడ్డాడు. కుక్కపేరు మార్చమని చెప్పినా యజమాని వినకపోవడంతో.. అతను యజమాని భార్యని కిరోసిన్ పోసి నిప్పంటించాడు...
పొరుగింట్లో ఉండే పెంపుడు కుక్కపేరు నచ్చకపోవడంతో ఆ కుక్క యజమానితో పక్కింటి వ్యక్తి గొడవపడ్డాడు. కుక్కపేరు మార్చమని చెప్పినా యజమాని వినకపోవడంతో.. అతను యజమాని భార్యని కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ జిల్లాలో జరిగింది.
గుజరాత్లోని భావనగర్ జిల్లా పరిధిలోని ఒక గ్రామంలో నివసించే సురభాయ్ భార్య పేరు సోను. అతని పక్కింట్లో కొ్త్తగా అద్దెకు దిగిన నీతాబెన్ దంపతులు ఒక కుక్కపిల్లను పెంచుకుంటున్నారు. ఆ కుక్కపిల్లను కూడా వారు సోను అని పిలిచేవారు. దీంతో పక్కింటి సురాభాయ్కి కోపం వచ్చింది. ఒక కుక్కపిల్లను తన భార్య పేరుతో పిలవకూడదని.. వెంటనే కుక్క పేరుని మార్చమని.. కుక్క యజమాని అయిన నీతాబెన్తో సురాభాయ్ గొడవపడ్డాడు. కానీ నీతాబెన్ అందుకు ఒప్పుకోలేదు.
మరుసటి రోజు నీతాబెన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సురభాయ్ నలుగురు మనుషులను తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ నీతాబెన్ను మహిళ అని కూడా చూడకుండా చితకబాదాడు. ఆమె అతడి నుంచి తప్పించుకొని కిచెన్లోకి పారిపోయింది. కానీ ఆమెను వెంబడిస్తూ సురభాయ్, అతని మనుషులు కిచెన్లోని కిరోసిన్ తీసుకొని ఆమెపై చల్లి నిప్పు పెట్టారు. ఆ తరువాత సురాభాయ్ తన మనుషులతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నీతాబెన్ మంటల్లో కాలిపోతుండగా.. ఆమె భర్త అక్కడికి వచ్చి మంటలను ఆర్పాడు. వెంటనే ఆమెను తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
నీతాబెన్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు సురభాయ్ని అరెస్టు చేయడానికి వెళ్లగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది.