Nellore జిల్లా: స్నేహితుడి భార్యకు మత్తుమందు ఇచ్చి...

ABN , First Publish Date - 2022-06-24T20:59:27+05:30 IST

నెల్లూరు: జిల్లాలో దారుణం వెలుగుచూసింది. లింగసముద్రం మండలం, చినపవనిలో స్నేహితుడి భార్యకు..

Nellore జిల్లా: స్నేహితుడి భార్యకు మత్తుమందు ఇచ్చి...

నెల్లూరు (Nellore): జిల్లాలో దారుణం వెలుగుచూసింది. లింగసముద్రం మండలం, చినపవనిలో స్నేహితుడి భార్య (Friend wife)కు మత్తుమందు ఇచ్చి ఓ కామాంధుడు అత్యాచారం (Rape) చేశాడు. వీడియోలు తీసి, బెదిరించి పలుమార్లు అఘాయిత్యం చేశాడు. ఈ అవమానం భరించలేక దంపతులు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం (Suicide attempt) చేశారు. తమ చావుకు ఇలియాజ్ కారణమంటూ దంపతులు సెల్పీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన దంపతులను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. 


తమ చావుకు ఇలియాజ్, మహబూబ్ బాషా, ఫాతిమా, హసీనాలే కారణమని బాధితురాలు తెలిపింది. తన భర్తను తాగుడుకు బానిసగా చేశారని, తనకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. బాధితురాలి భర్త మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నామన్నారు. ఇక బతకలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్నామన్నారు.


బాధిత భార్యభర్తలు ఇద్దరూ నెల్లూరు రంగనాయకపేటకు చెందినవారు. వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి నిన్న (గురువారం) జరుగుతున్న సమయంలో నిందితుడు ఇలియాజ్ అక్కడకు వెళ్లి గతంలో తీసిన వీడియోలు నెట్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్యా భర్తలు సెల్ఫీ వీడియో తీసి, లేఖ రాసి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బంధువులు వారిని హుటాహుటిన కావలి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-24T20:59:27+05:30 IST