బోస్ ఆలోచనాపరుడు.. చేతల మనిషి: నేతాజీ కుమార్తె అనితా బోస్

ABN , First Publish Date - 2022-01-24T23:47:51+05:30 IST

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచనాపరుడు మాత్రమే కాకుండా చేతల మనిషి కూడానని ఆయన కుమార్తె అనితా బోస్ పిఫాప్..

బోస్ ఆలోచనాపరుడు.. చేతల మనిషి: నేతాజీ కుమార్తె అనితా బోస్

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆలోచనాపరుడు మాత్రమే కాకుండా చేతల మనిషి కూడానని ఆయన కుమార్తె అనితా బోస్ పిఫాప్ పేర్కొన్నారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రజలను ఉద్దేశించి జర్మనీ నుంచి అనిత ఓ సందేశాన్ని విడుదల చేశారు.


నమస్కారంతో తన సందేశాన్ని ప్రారంభించిన అనిత.. ‘‘భారతదేశానికి నమస్కరిస్తున్నా. మహమ్మారితో దేశం పోరాడుతున్న ఈ సమయంలో భారతీయ ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నా. ప్రజలు నిత్యం స్మరించుకునే భారత బిడ్డ, నా తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 సంవత్సరాల క్రితం కటక్‌లో జన్మించారు. ఆయన 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నేతాజీని గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.

 

 దేశంపై తన తండ్రికి ఉన్న ‘విజన్’ గురించి మాట్లాడుతూ.. ‘‘నేతాజీ ఆలోచనాపరుడు మాత్రమే కాదు, చేతల మనిషి కూడా. దేశంపై ఆయనకో ‘విజన్’ ఉంది. ఈ దేశం ఆధునికమైనది, తత్వశాస్త్రంలో, మతపరమైన సంప్రదాయాలలో చరిత్రలో వేళ్లూనుకుపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని నేతాజీ ముందే ఊహించారు. తాము ఎదుర్కొనే వ్యక్తులలో ఆయన కూడా భాగం కావాలని ఆశించారు. దురదృష్టవశాత్తు అది జరగలేదు’’ అని అనితా బోస్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులంత గొప్పవాళ్లం కాకపోయినా మనం మన ఇండియా కోసం, మన భారతీయ పౌరుల కోసం, ప్రపంచ పౌరుల కోసం మనవంతు సహకారం అందిద్దామని పిలుపునిచ్చారు.


“నేతాజీ భక్తిపరుడు. భక్తుడైన హిందువు. హిందువు అన్ని ఇతర మతాల పట్ల సహనం కలిగి ఉంటాడు. కుటుంబ సభ్యులు, అనుచరులు, స్నేహితులు అందరూ అన్ని మతాలను గౌరవించేలా, నిజాయతీగా ఉండేలా నేతాజీ ప్రేరణ ఇచ్చారు. నేతాజీ భావోద్వేగం దేశంపై ఆయనకున్న ప్రేమ సహా అన్నింటినీ మించిపోయింది. స్నేహితులు, కుటుంబంపై ఎనలేని విధేయత చూపేవారు. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు. నేతాజీ ఆలోచనలు, ఆదర్శాల నుంచి మనందరం ప్రేరణ పొందగలమని నేను ఆశిస్తున్నాను. నమస్కారం,  ‘జై హింద్’  అని తన సందేశాన్ని ముగించారు. 


నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆదివారం ఆయనకు దేశం ఘనంగా నివాళులర్పించింది, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాన్ని నేతలు ప్రశంసించారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. 

Updated Date - 2022-01-24T23:47:51+05:30 IST