రాహుల్ నిర్ణయంపై నెటిజెన్ల హర్షం
ABN , First Publish Date - 2021-04-18T20:39:47+05:30 IST
ప్రస్తుతం ట్విట్టర్లో ‘మై లీడర్ రాహుల్గాంధీ’ అనే హ్యాష్ట్యాగ్ ఇండియా ట్రెండ్లో టాప్ స్థానంలో ఉంది. రాహుల్ ప్రజా నాయకుడని, విద్యావేత్త అని అందుకే స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం, వారి బాగు కోసం ఆలోచిస్తారని
న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఆయన పాల్గొనవలసిన అన్ని బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు. భారీ బహిరంగ సభల ఏర్పాటు వల్ల పర్యవసానాలను ఆలోచించాలని ఇతర రాజకీయ నాయకులను ఆయన కోరారు.
అయితే రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజెన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ‘మై లీడర్ రాహుల్గాంధీ’ (నా నాయకుడు రాహుల్గాంధీ) అంటూ పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వివిధ పార్టీలు, నేతలు భారీ ఎత్తున ఎన్నికల ర్యాలీలు తీస్తుంటే రాహుల్ మాత్రం ప్రజల కోసం ఎన్నికల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని, దేశం కోరుకునే నిజమైన నాయకుడు రాహులేనని అభినందనలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ట్విట్టర్లో ‘మై లీడర్ రాహుల్గాంధీ’ అనే హ్యాష్ట్యాగ్ ఇండియా ట్రెండ్లో టాప్ స్థానంలో ఉంది. రాహుల్ ప్రజా నాయకుడని, విద్యావేత్త అని అందుకే స్వప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం, వారి బాగు కోసం ఆలోచిస్తారని, దానికి తాజా నిర్ణయమే అతి పెద్ద ఉదాహరణ అని నెటిజెన్లు కొనియాడుతున్నారు. రాహుల్కు జేజేలు పలికే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆదివారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ స్పందిస్తూ ‘‘కోవిడ్ విస్తృతి తీవ్రంగా ఉన్న కారణంగా పశ్చిమ బెంగాల్లో నేను పబ్లిక్ ర్యాలీలను రద్దు చేసుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ ర్యాలీలు నిర్వహించడం వల్ల కలిగే అనర్థాల గురించి లోతుగా ఆలోచించాలని ఇతర రాజకీయ నాయకులకు విజ్ణప్తి చేస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు.