Liz Truss: అప్పుడే రంగంలోకి బ్రిటన్ ప్రధాని.. ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటన

ABN , First Publish Date - 2022-09-09T00:20:28+05:30 IST

బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ అప్పుడే రంగంలోకి దిగిపోయారు. జీవన వ్యయ సంక్షోభ నివారణకు నడుం బిగించారు.

Liz Truss: అప్పుడే రంగంలోకి బ్రిటన్ ప్రధాని.. ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటన

లండన్: బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ అప్పుడే రంగంలోకి దిగిపోయారు. జీవన వ్యయ సంక్షోభ నివారణకు నడుం బిగించారు. అందులో భాగంగా పెరుగుతున్న విద్యుత్ బిల్లులతో ఇబ్బందులు పడుతున్న బ్రిటిష్ పౌరులను గట్టెక్కించేందుకు, ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే. ఈ నిర్ణయంతో బ్రిటన్ ప్రజల విద్యుత్ చార్జీలను రెండేళ్లపాటు ఏడాదికి 2,500 పౌండ్ల (2,880 డాలర్లు) కంటే ఎక్కువ చెల్లించాల్సిన పని ఉండదు. ఫలితంగా ఒక్కో ఇంటికి ఏడాదికి 1000 పౌండ్ల వరకు ఆదా అవుతుంది. 


ప్రధాని తాజా నిర్ణయంతో వచ్చే ఆరు నెలలపాటు వ్యాపారాలకు సమానమైన హామీ ఉంటుంది. ఆతిథ్యం వంటి బలహీనమైన రంగాలకు అప్పుడు మరింత మద్దతు లభిస్తుందని ఈ సందర్భంగా లిజ్ ట్రస్ తెలిపారు. వ్యాపారాలు మరింత బలీయంగా మారేందుకు మార్గాలను అన్వేషించాలని, సొంతంగా విద్యుత్ ఉత్పాదకత వైపు దృష్టి సారించాలని కోరారు. ప్రధాని చెబుతున్న దాని ప్రకారం 2040 నాటికి యూకే ‘నికర ఇంధన ఎగుమతిదారు’ అవుతుంది. వృద్ధి, శ్రేయస్సు కోసం సురక్షితమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమైనదని ఈ సందర్భంగా లిజ్ పేర్కొన్నారు.

Updated Date - 2022-09-09T00:20:28+05:30 IST