మీడియాకు మొహం చాటేసిన సీఎం జగన్

ABN , First Publish Date - 2022-04-06T21:43:22+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. అయితే మీడియాకు కనిపించకుండానే...

మీడియాకు మొహం చాటేసిన సీఎం జగన్

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. అయితే మీడియాకు కనిపించకుండానే ఆయన విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. ఓ వైపు అమరావతిపై నిరసనలు.. మరోవైపు ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీలపై ఆందోళనలతో జగన్ ప్రభుత్వం ఇరుకున పడింది. వాటికి తోడు పన్నులు, అప్పులు వంటి విషయాలు మీడియా నుంచి ప్రశ్నలు ఎదురైతే ఇబ్బంది పడాల్సి వస్తుందనే హస్తిన పర్యటన ముగించుకుని వెనుదిరిగారు.


సీఎం జగన్ నిన్న ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత కేంద్రమంత్రులతో సమావేశం అయ్యారు. నిర్మల సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, అమిత్ షాతో భేటీ అయ్యారు. బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖ, భోగాపురం, బీచ్ కారిడర్‌కు సంబంధించిన ప్రాజెక్టు.. దానికి సంబంధించి మరింత మేలైన ఆలోచన చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహా మేరకు అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సీఎం జగన్ వివరించారు. విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా ప్రాజెక్టును తీర్చి దిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని గడ్కరీని సీఎం జగన్ కోరారు.

Updated Date - 2022-04-06T21:43:22+05:30 IST