అమ్మఒడిలో నయా మోసం
ABN , First Publish Date - 2022-06-27T06:43:54+05:30 IST
నిబంధనల పేరిట అమ్మఒడి సాయంలో సీఎం జగన్మోహనరెడ్డి నయా మోసానికి పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.
నిబంధనల పేరుతో కోత
మాజీమంత్రి కాలవ
అనంతపురం, జూన 26 (ఆంధ్రజ్యోతి): నిబంధనల పేరిట అమ్మఒడి సాయంలో సీఎం జగన్మోహనరెడ్డి నయా మోసానికి పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. వేలాది మంది నిరుపేద విద్యార్థులకు అమ్మఒడి సాయాన్ని దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల జీవితాలతోనూ సీఎం జగన ఆడుకోవడం దారుణమన్నారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి అనంత జిల్లాలో గతేడాదితో పోలిస్తే... రూ. 74 కోట్లు తక్కువగా మంజూరైందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం 7,05,468 మంది విద్యార్థులుం డగా... అందులో ఈ ఏడాది కేవలం 3,83,283 మందికి మాత్రమే అమ్మఒడి సొమ్ము మంజూరైందన్నారు. అందులోనూ అనేక నిబంధనలు పెట్టి వేలాది మంది అర్హులకు అమ్మఒడి రాకుండా చేశారన్నారు. గతేడాది ఉమ్మడి అనంత జిల్లాకు రూ. 572 కోట్లు మంజూరుకాగా.. ఈఏడాది రూ. 498 కోట్లు ఇస్తున్నారన్నారు. ప్రధానంగా కరెంటు బిల్లులు 300 యూనిట్లు దాటితే అమ్మఒడి ఇవ్వబోమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీనివల్ల దిగువ, మధ్య, పేదతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు అన్యాయం జరుగుతోందన్నారు. అదే విధంగా 75 శాతం హాజరు లేదన్న కారణం చూపి మరికొందరికి.. ఆధార్ అనుసంధానం కాలేదని ఇంకొందరిని జాబితా నుంచి తొలగించడం అన్యాయమన్నారు. దినకూలీల పిల్లలకు అమ్మఒడి సాయాన్ని ఇవ్వకపోవడంకన్నా.. మరొక దారుణం ఉండదని విమర్శించారు. ఒక తల్లికి ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నా అందరికీ అమ్మఒడి ఇస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన జగనరెడ్డి అధికారంలోకి రాగానే ఒక్కరికే పరిమితం చేయడంతో పాటు.. నిబంధనల పేరుతో ప్రతిఏటా లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుండటం నయవంచనకాక... మరేమిటని కాలవ ప్రశ్నించారు. ఇప్పటికైనా పేద పిల్లలందరికీ అమ్మఒడి పథకం ప్రయోజనాలను అందించాలని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగనను డిమాండ్ చేశారు.