ఏసీలకు కొత్త ఇంధన రేటింగ్స్‌

ABN , First Publish Date - 2022-06-21T09:22:00+05:30 IST

భారత్‌లో తయారయ్యే ఎయిర్‌ కండీషనర్స్‌ (ఏసీ) ఇంధన సామర్థ్యం మరింత పెరగనుంది.

ఏసీలకు కొత్త ఇంధన రేటింగ్స్‌

జూలై నుంచే అమలు ..

10% పెరగనున్న ధరలు

న్యూఢిల్లీ: భారత్‌లో తయారయ్యే ఎయిర్‌ కండీషనర్స్‌ (ఏసీ) ఇంధన సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రభుత్వ నిర్వహణలోని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) ఇందుకోసం కొత్త ఇంథన ప్రమాణాలు ఖరారు చేసింది. ఈ కొత్త రేటింగ్స్‌ ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఈ వేసవిలో కొన్న 5 స్టార్‌ ఏసీ రేటింగ్‌.. వచ్చే నెల నుంచి 4 స్టార్‌కు పడిపోతుంది. కొత్త ఇంధన రేటింగ్‌ ప్రకారం ఏసీలు తయారు చేయడంతో వాటి ధర 7 నుంచి 10 శాతం వరకు పెరుగుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. 


పెరగనున్న ఇంధన సామర్థ్యం:

వచ్చే నెల నుంచి కంపెనీలు.. బీఈఈ ఖరారు చేసిన కొత్త ప్రామాణికాల ప్రకారం ఏసీలు తయారు చేయాలి. ఈ కొత్త ఏసీల ఇంధన సామర్థ్యం.. పాత వాటితో పోలిస్తే 20 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే తయారు చేసిన ఏసీల స్టాక్‌ను ఆరు నెలల్లో విక్రయించుకోవాలి. నిజానికి ఈ ఏడాది జనవరి నుంచే బీఈఈ ఈ నిబంధనలు అమలు చేయాలని చూసింది. అయితే కొవిడ్‌తో అమ్ముడుపోకుండా పోగైన స్టాక్‌ను వదిలించుకునేందుకు కంపెనీలు ఈ ఏడాది జూన్‌ వరకు గడువు పొడిగించాలని కోరడంతో.. ఆరు నెలల గడువు పొడిగించారు.


పాత ఏసీలతో పోలిస్తే కొత్త ఎనర్జీ రేటింగ్స్‌తో తయారు చేసే ఏసీల ఇంధన సామర్థ్యం 20 శాతం ఎక్కువ. ఇప్పటికే ఉన్న నిల్వలను ఆరు నెలల్లో విక్రయించుకోవాలి.

-కమల్‌ నంది, బిజినెస్‌ హెడ్‌, గోద్రేజ్‌  అప్లయన్సెస్‌

కొత్త ప్రమాణాలతో ఒక్కో ఏసీ ఉత్పత్తి వ్యయం రూ.2,000 నుంచి రూ.2,500 వరకు పెరుగుతుంది. కొనుగోలుదారులపైన ఆ మేరకు భారం పడుతుంది. అయితే అదే సమయంలో పాత ఏసీలతో పోలిస్తే కొత్త ఏసీల ఇంధన సామర్థ్యం 20 శాతం పెరుగుతుంది.

- రాజేశ్‌ రాఠీ, సేల్స్‌ హెడ్‌, లాయిడ్స్‌ 

Updated Date - 2022-06-21T09:22:00+05:30 IST