Dubai: దుబాయ్లో ప్రారంభమైన మరో హిందూ దేవాలయం
ABN , First Publish Date - 2022-10-05T18:01:05+05:30 IST
దుబాయ్లో మరో హిందూ దేవాలయం అందుబాటులోకి వచ్చింది.
దుబాయ్: దుబాయ్లో మరో హిందూ దేవాలయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఆలయాన్ని జబెల్ అలీ సమీపంలోని వర్షిప్ విలేజ్ అనే ప్రాంతంలో నిర్మించారు. ఇటీవలే నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ దేవాలయంలో 16 దేవతా విగ్రహాలు సహా గురుగ్రంథ్ సాహిబ్ కూడా ఉంటుందని భారత్ అంబాసిడర్ సంజయ్ సుధీర్ తెలిపారు. మంగళవారం ప్రారంభమైన ఈ ఆలయం ఇవాళ్టి(బుధవారం) నుంచి దర్శనార్థం సామాన్య భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ దేవాలయంలో ప్రజల కోసం పెళ్లిలు, ప్రైవేట్ ఈవెంట్లు నిర్వహించుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయని ఆలయ కమిటీ వెల్లడించింది.
ఆలయం ప్రత్యేకతలివే..
దేవాలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ, నాలెడ్జ్ సెంటర్లలో పెద్ద సైజు ఎల్సీడీ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. ఆలయం డోర్లు వాల్నట్తో రూపొందించడం జరిగింది. అలాగే దక్షిణ భారత దేవతలను నల్ల రాతితో తయారు చేశారు. దేవాలయంలో గణేషుడు, కృష్ణుడు, మహాలక్ష్మీ, గురువాయూరప్పన్, అయ్యప్పన్ ఇలా మొత్తం 15 దేవుళ్లతో పాటు శివుడు ప్రధాన దేవుడిగా పూజలు అందుకోనున్నారు. అంతేగాక ఆలయంలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అలాగే దేవాలయంలో నిత్యం పూజలు నిర్వహించడానికి 8మంది పూజారులను శాశ్వతంగా నియమించడం జరిగింది.