ఆంగ్లసంవత్సరాది వేడుకలకు కఠిన నిబంధనలు
ABN , First Publish Date - 2021-12-30T14:47:38+05:30 IST
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలను కరోనా కట్టుబాట్ల నడుమ జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అదే సమయంలో మద్రాసు హైకోర్టు ఈ నెల 31వ తేదీ రాత్రి
- మద్యం అమ్మకాలు తగ్గిస్తూ హైకోర్టు ఉత్తర్వులు
చెన్నై: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలను కరోనా కట్టుబాట్ల నడుమ జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అదే సమయంలో మద్రాసు హైకోర్టు ఈ నెల 31వ తేదీ రాత్రి మూడుగంటలపాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. రాత్రి 12.30 గంటల వరకే వేడుకలను జరుపుకోవాలని ఆదేశించింది. వేడుకలపై ఎలాంటి నిషేధపుటుత్తర్వులు జారీ చేయలేదు. దీనితో పుదుచ్చేరి. సముద్రతీర ప్రాంతాల్లోని ఫామ్హౌస్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలో ఈనెల 31వ తేదీ రాత్రి విందులు, వినోదాలు, సాంస్కృతిక కార్యక్రమాలను 50 శాతం మందితో భౌతికదూరం పాటింపులతో జరుపుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రైవేటు సంస్థలతో కలిసి మూడు రోజులపాటు సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహించనుంది. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించి ప్రైవేటు సంస్థలు, స్టార్హోటళ్లు జారీ చేసిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. మంగళవారం ఆ రాష్ట్రంలో ఇరువురికి ‘ఒమైక్రాన్’ సోకిన విషయం తెలిసిందే. అయినా ఆంగ్ల సంవత్సరాది వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ప్రజలకు అనుమతినిచ్చింది. పొరుగు రాష్ట్రాలలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలపై కఠిన నిబంధనలు అమలు చేయనుండటంతో ఆ రాష్ట్రాలకు చెందినవారంతా పుదుచ్చేరికి తరలివెళుతున్నారు. ఈ పరిస్థితులలో పుదుచ్చేరిలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలపై నిషేధం విధించాలని కోరుతూ మక్కల్ వాళ్వురిమై కార్యదర్శి జగన్నాధన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ జారీ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తులు వైద్యనాథన్, భరతన్ చక్రవర్తి కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు ఈనెల 31 రాత్రి 10 నుంచి జనవరి 1వ తేదీ వేకువజాము ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు జరుపకూడదంటూ నిషేధం ప్రకటించారు.