న్యూయార్క్లో పంజాబీలకు దక్కిన అరుదైన గౌరవం
ABN , First Publish Date - 2020-10-27T00:54:45+05:30 IST
అమెరికాలో పంజాబీ కమ్యూనిటీకి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే 101 అవెన్యూ అనే ప్రాంతానికి
న్యూయార్క్: అమెరికాలో పంజాబీ కమ్యూనిటీకి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే ఓ ప్రాంతానికి ‘పంజాబ్ ఎవెన్యూ’ అని న్యూయార్క్ సిటి కౌన్సిల్ నామకరణం చేసింది. 101 అవెన్యూ.. స్ట్రీట్ నెం.111 నుంచి 123 వరకు ఉన్న ప్రాంతాన్ని ఇకపై పంజాబ్ ఎవెన్యూగా పిలవనున్నారు. కౌన్సిల్ మెంబర్ అడ్రీన్ ఆడమ్స్ పంజాబ్ ఎవెన్యూ ప్రాంతాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంజాబీలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో భారత్కు చెందిన పంజాబీలు అధిక సంఖ్యలో ఉండటంతో పంజాబ్ ఎవెన్యూగా ప్రాంతానికి నామకరణం చేయాలని అడ్రీన్ ఆడమ్స్ గతంలో న్యూయార్క్ సిటీ కౌన్సిల్లో ప్రతిపాదించారు.
గత రెండేళ్ల నుంచి ఈ ప్రాంతానికి పంజాబ్ ఎవెన్యూ అని పేరు పెట్టేందుకు అనేక సౌత్ ఏషియన్ గ్రూపులు, సిటీ కౌన్సిల్ మెంబర్ అడ్రీన్ ఆడమ్స్ కష్టపడ్డారు. ఎట్టకేలకు వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇదే ప్రాంతంలో రెండు అతిపెద్ద గురుద్వారాలు కూడా ఉండటం విశేషం. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని మెజారిటీ వ్యాపారస్థులు కూడా పంజాబీ కమ్యూనిటీకి చెందినవారే. కాగా.. న్యూయార్క్లో తమకు దక్కిన గౌరవం పట్ల పంజాబ్ కమ్యూనిటీ ఆనందం వ్యక్తం చేసింది. పంజాబీ కమ్యూనిటీని గుర్తించి ప్రత్యేక గౌరవం ఇచ్చినందుకు సిటి కౌన్సిల్కు పంజాబీలు ధన్యవాదాలు తెలిపారు.