ఐపీఎల్ నిర్వహణకు ముందుకొచ్చిన న్యూజిలాండ్

ABN , First Publish Date - 2020-07-07T03:15:33+05:30 IST

భారత్‌లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని

ఐపీఎల్ నిర్వహణకు ముందుకొచ్చిన న్యూజిలాండ్

ముంబై: భారత్‌లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీని విదేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్న బీసీసీఐకి మరో ఆఫర్ వచ్చింది. ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇప్పటికే యూఏఈ, శ్రీలంక ముందుకు రాగా, తాజాగా న్యూజిలాండ్ కూడా రేసులో దిగింది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యం కాకపోతే తాము ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీసీసీఐకి తెలియజేసింది. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా ప్రకటన త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఒకే ఒక్క కరోనా కేసు యాక్టివ్‌గా ఉంది.  


స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నా దేశంలో శరవేగంగా పెరుగుతున్న కేసులు ప్రపంచంలోనే భారత్‌ను మూడో స్థానంలో నిలబెట్టాయి. దీంతో సెప్టెంబరు చివర్లో, లేదంటే నవంబరు మొదట్లో ఐపీఎల్ నిర్వహించాలనుకున్న బీసీసీఐ ఆశలు దాదాపు అడుగంటాయి. తమ మొదటి ప్రాధాన్యం ఇండయానే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ ఇక్కడ నిర్వహించడం సురక్షితం కాదని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యూఏఈ, శ్రీలంక తర్వాత ఇప్పుడు ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు న్యూజిలాండ్ ముందుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. బ్రాడ్‌కాస్టర్లు, జట్లతో సమావేశమైన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని, తమకు ఆటగాళ్ల భద్రతే అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పుకొచ్చారు.  

Updated Date - 2020-07-07T03:15:33+05:30 IST