హర్మన్‌ప్రీత్ పోరాటం వృథా.. కివీస్ చేతిలో భారత్ ఓటమి

ABN , First Publish Date - 2022-03-10T21:20:27+05:30 IST

హర్మన్‌ప్రీత్ కౌర్ పోరాటం వృథా అయింది. కివీస్ బౌలర్ల దెబ్బకు కుదేలైన భారత జట్టు ప్రపంచకప్‌లో తొలి

హర్మన్‌ప్రీత్ పోరాటం వృథా.. కివీస్ చేతిలో భారత్ ఓటమి

హమిల్టన్: హర్మన్‌ప్రీత్ కౌర్ పోరాటం వృథా అయింది. కివీస్ బౌలర్ల దెబ్బకు కుదేలైన భారత జట్టు ప్రపంచకప్‌లో తొలి ఓటమిని మూటగట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన మిథాలీ సేన బలమైన కివీస్ జట్టును ఎదురించలేకపోయింది. ఫలితంగా 62 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచకప్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ను 4-1తో మట్టికరిపించిన న్యూజిలాండ్ జట్టు నేటి మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది.


తొలుత అమెలియా కెర్ (50), సాటర్త్‌వైట్ (75) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు కివీస్ బౌలర్ల ఎదురుదాడి ముందు నిలవలేకపోయింది. కెప్టెన్ మిథాలీరాజ్ 31 పరుగులు చేసినప్పటికీ క్రీజులో కుదురుని దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమైంది.


హర్మన్‌ప్రీత్ మాత్రం కాస్తంతా జోరుగానే ఆడింది. సహచరులు ఒక్కొక్కరే వెనుదిరుగుతున్నా ఆమె మాత్రం క్రీజులో పాతుకుపోయి న్యూజిలాండ్‌ బౌలర్లను ఎదురొడ్డింది. 63 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 71 పరుగులు చేసి అవుటైంది. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఫలితంగా 46.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌట్ ఓటమిని మూటగట్టుకుంది. భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌లో ఈ నెల 12న వెస్టిండీస్‌తో తలపడుతుంది.

Updated Date - 2022-03-10T21:20:27+05:30 IST