Delhi Excise Policy Case: అరెస్టుకు బెదిరేది లేదు, మోదీకి పోటీ ఎవరో తేలిపోయింది : మనీశ్ సిసోడియా

ABN , First Publish Date - 2022-08-20T18:55:49+05:30 IST

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

Delhi Excise Policy Case: అరెస్టుకు బెదిరేది లేదు, మోదీకి పోటీ ఎవరో తేలిపోయింది : మనీశ్ సిసోడియా

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మధ్య పోటీ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) చెప్పారు. కేజ్రీవాల్‌ను అడ్డుకునేందుకే తనపై సీబీఐ (CBI) కేసును నమోదు చేశారని ఆరోపించారు. 


ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం (Excise Policy) అమలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) శుక్రవారం మనీశ్ సిసోడియా ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సిసోడియా శనివారం తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్రంగా విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను అడ్డుకునేందుకే తనపై సీబీఐ కేసు పెట్టారని ఆరోపించారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ మోదీ, కేజ్రీవాల్ మధ్యనే ఉంటుందని చెప్పారు. 


ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ ‘న్యూయార్క్ టైమ్స్’ మొదటి పేజీలో కథనం రావడం దేశానికి గర్వకారణమని చెప్పారు. రాష్ట్రంలో పాఠశాలలు మెరుగ్గా ఉండటానికి కారణం తాను కాదని, తాను ఏదో చేసినందువల్ల ఈ కథనం మొదటి పేజీలో వచ్చిందని తాను చెప్పడం లేదన్నారు. ఢిల్లీలోని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులే ఈ ఫలితాలకు కారకులని తెలిపారు. తాను టీచర్లకు ధన్యవాదాలు చెప్తున్నానన్నారు.  గంగా నది వెంబడి వేలాది మంది కోవిడ్-19 మహమ్మారి బాధితుల శవాలకు అంత్యక్రియలు చేస్తున్న దృశ్యాలను అదే పత్రిక ప్రచురించిందన్నారు. ఇది ఓ భారతీయునిగా తనకు సిగ్గు చేటు అని తెలిపారు. కానీ ఢిల్లీ విద్యా విధానంపై వచ్చిన కథనం మనందరికీ గర్వకారణమన్నారు. 


రెండు, మూడు రోజుల్లో అరెస్టు 

బీజేపీ, ప్రధాని మోదీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, అరవింద్ కేజ్రీవాల్‌ను అడ్డుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారని సిసోడియా చెప్పారు. విద్య, ఆరోగ్య రంగాల్లో కేజ్రీవాల్ చేస్తున్న కృషి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని చెప్పారు. సీబీఐ అధికారులు శుక్రవారం తన నివాసంతోపాటు, విద్యా శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారన్నారు.  విద్య, ఆరోగ్య రంగాల్లో తాము చేస్తున్న కృషిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. సత్యేందర్ జైన్ ఇప్పటికే జైలులో ఉన్నారని, రెండు, మూడు రోజుల్లో తనను కూడా అరెస్టు చేస్తారని, అరెస్టుకు తాను భయపడేది లేదన్నారు. తమను ఎవరూ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. 


పారదర్శకత, నిజాయితీ

ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీని పూర్తి పారదర్శకత, నిజాయితీలతో అమలు చేశామన్నారు. ఇది మన దేశంలో అత్యుత్తమ విధానమని తెలిపారు.  లెఫ్టినెంట్ గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఉంటే రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కనీసం రూ.10,000 కోట్లు ఆదాయం వచ్చి ఉండేదన్నారు. వాళ్ళ సమస్య అరవింద్ కేజ్రీవాలేనని, ఆయనను ఆపేందుకే వారు తన నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేశారన్నారు. ‘‘నేను ఎటువంటి అవనీతికి పాల్పడలేదు’’ అన్నారు. 


సోదాలు చేసిన అధికారులకు ధన్యవాదాలు

విద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారని, సోదాలు చేసిన అధికారులంతా చాలా గొప్పవారని తెలిపారు. వారు చాలా వినమ్రంగా ప్రవర్తించారని తెలిపారు. అయితే వారు తమ హైకమాండ్ ఆదేశాలను పాటించక తప్పదన్నారు. వారు మంచిగా ప్రవర్తించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. తాను కేజ్రీవాల్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ఈ సోదాలు మద్యం గురించి కాదని, కేవలం రాజకీయాల కోసమేనని ఆరోపించారు. ఎక్సయిజ్ విధానంలో కుంభకోణం జరగలేదన్నారు. 


15 మందిపై సీబీఐ కేసు

ఢిల్లీ ఎక్సయిజ్ విధానం అమలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ శుక్రవారం 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఖాతాలను తప్పుగా రాశారని, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, అవినీతి జరిగిందని ఆరోపించింది. సిసోడియా నివాసంతోపాటు దాదాపు 31 చోట్ల సోదాలు నిర్వహించారు. 


Updated Date - 2022-08-20T18:55:49+05:30 IST