చెరువులో.. తవ్వకాలు
ABN , First Publish Date - 2022-01-20T05:28:27+05:30 IST
కన్ను పడిందంటే దానిని ఆదాయ మార్గంగా అధికార పార్టీకి చెందిన నేతలు మార్చేసుకుంటున్నారు.
మట్టిపై అధికారపార్టీకి నేతల కన్ను
అనుమతులు లేకుండానే యథేచ్ఛగా తవ్వకాలు
చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
నిడుముక్కల(తాడికొండ), జనవరి 19: కన్ను పడిందంటే దానిని ఆదాయ మార్గంగా అధికార పార్టీకి చెందిన నేతలు మార్చేసుకుంటున్నారు. మండలం నిడుముక్కల చెరువుపై కన్నేసిన నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. మట్టి అవసరమైన వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. వారం రోజుల నుంచి యథేచ్ఛగా ఎక్స్కవేటర్ పెట్టి మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి చూడడంలేదు. ట్రక్కుకు రూ.700 నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారని సమాచారం. గ్రామస్తులకు అనుమానం రాకుండా రోజు మార్చి రోజు మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఇటీవల వెలిసిన వెంచర్లకు మట్టి అవసరం ఎక్కువగా ఉండటంతో నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. పంచాయతీ అంగీకారంతో పాటు మైనింగ్ అధికారుల అనుమతులు ఉండాలి. కాని ఇక్కడ అలాంటివి ఏమీ లేకుపోయినా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. పంచాయతీ ఆదాయం కోల్పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నారు.
తవ్వకాలను ఆపేయించాను
చెరువులో మట్టి తవ్వకాలు తన దృష్టికి వచ్చింది. ఆ వెంటనే తవ్వకాలు నిలుపుదల చేయించాను. తవ్వకాలు జరపుకుండా వీఆర్వో పర్యవేక్షించాలని ఆదేశించాను. అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం. - వైవీబీ కుటుంబరావు, తహసీల్దారు