‘గడపగడప’లో నిలదీతలు
ABN , First Publish Date - 2022-07-02T06:45:29+05:30 IST
‘గడపగడప’లో భాగంగా డీఎంపురంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని గ్రామస్తులు నిలదీశారు.
చిత్తూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కార్వేటినగరం మండలంలోని డీఎంపురం గ్రామంలో పర్యటించారు. గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు పెద్ద బుడ్డయ్య తన సమస్యలపై నారాయణస్వామిని గట్టిగా నిలదీశారు. అదే గ్రామానికి చెందిన సుబ్బమ్మ తనకు రూ.1.18 లక్షల కరెంటు బిల్లు వచ్చిందని, ఈ కారణంగా అమ్మఒడి, రైతు భరోసా పథకాల లబ్ధి దూరమైందని నారాయణస్వామి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన స్పందించి అధికారులతో మాట్లాడారు. వెంటనే విద్యుత్తు మీటరు మార్చాలని, ఆయా పథకాల లబ్ధి అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. డ్రైనేజీ కాలువపైన మూత వేయకుండా వదిలేయడంతో దోమలతో ఇబ్బందిగా ఉందని, చిన్న పిల్లలు కూడా ఆ కాలువలో పడిపోతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేదని ఫిర్యాదు చేయగా రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తానని నారాయణస్వామి హామీనిచ్చారు.